స్వదేశంలో అఫ్గానిస్థాన్తో భారత్ మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. మొహాలి వేదికగా రేపు రాత్రి 7 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్కు భారత జట్టును సెలక్టర్లు ప్రకటించిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. టీమిండియాను వెల్లడించే సమయంలో సెలక్టర్లు ప్రెస్ మీట్ను నిర్వహించలేదు. అంతేగాక బీసీసీఐ విడుదల చేసిన ప్రెస్ నోట్లో ఆటగాళ్లను తప్పించడంపై కనీస వివరాలు కూడా వివరించలేదు.
కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్కు విశ్రాంతి ఇచ్చారా? విస్మరించారా? అనేది తెలియని పరిస్థితి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితో పాటు కేఎల్ రాహుల్ కూడా 14 నెలల క్రితం భారత్ తరపున చివరి టీ20 ఆడాడు. కానీ ఇప్పుడు రోహిత్, కోహ్లి రీఎంట్రీ ఇస్తున్నారు. దీంతో రాహుల్కు మొండిచేయి చూపించారా లేదా ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ కోసం విశ్రాంతి ఇచ్చారా అనే విషయంపై స్పష్టత లేదు.

మరోవైపు ఇషాన్ కిషన్ గురించి గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇషాన్ కిషన్పై వేటు వేశారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 2022 డిసెంబర్లో బంగ్లాదేశ్తో జరిగిన వన్డేలో ఇషాన్ డబుల్ సెంచరీ సాధించాడు. దాంతో రోహిత్ శర్మతో పాటు ఇషాన్ ఓపెనర్గా ఫిక్స్ అయ్యాడని భావించారంతా. కానీ తర్వాత జరిగిన శ్రీలంక సిరీస్లో ఇషాన్ను తప్పించి శుభ్మన్ గిల్కు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత నుంచి అతడు బ్యాకప్ ఓపెనర్గా మిగిలిపోయాడు.
అయితే వన్డే ప్రపంచకప్ ముందు కేఎల్ రాహుల్ గాయంతో జట్టుకు దూరమవ్వడంతో ఇషాన్ కిషాన్ మిడిలార్డర్ బ్యాటర్గా, వికెట్ కీపర్గా జట్టుకు సేవలు అందించాడు. ఆకట్టుకునే ప్రదర్శనలతో సత్తాచాటాడు. కానీ రాహుల్ రీఎంట్రీతో మళ్లీ జట్టులో చోటు కోల్పోయాడు. మరోవైపు టీ20ల్లో పంత్ స్థానంలో ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన ఇషాన్ కిషన్కు అవకాశం వస్తుందనుకుంటే సంజు శాంసన్, జితేంద్ర శర్మకు సెలక్టర్లు అవకాశాలు ఇస్తున్నారు.
జట్టుతోనే ఉంటూ తక్కువ అవకాశాలు వస్తుండటంతో మానసికంగా కృంగిపోయిన ఇషాన్ కిషన్ వన్డే వరల్డ్ కప్ అనంతరం బీసీసీఐని విశ్రాంతి కోరాడని సమాచారం. కానీ బీసీసీఐ ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు ఎంపిక చేసింది. కానీ చివరి రెండు మ్యాచ్లకు బెంచ్కే పరిమితం చేశారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు ఇషాన్ వెళ్లాడు. విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐని మరోసారి కోరడంతో ఎట్టకేలకు అతడికి అనుమతి ఇచ్చారు.
అయితే కుటుంబంతో గడపడానికి సమయం కోరిన ఇషాన్ దుబాయ్కు వెళ్లాడు. అక్కడ పార్టీలో కనిపించాడు. అంతేగాక బీసీసీఐ అనుమతి లేకుండా కౌన్ బనేగా కరోడ్పతి టీవీ షోలో పాల్గొన్నట్లు సమాచారం. ఈ విషయాలపై బీసీసీఐ కన్నెర్ర చేసిందని తెలుస్తోంది. అఫ్గానిస్థాన్ సిరీస్కు అందుబాటులో ఉంటున్నట్టు ఇషాన్ తెలియజేసినప్పటికీ అతడికి మొండిచేయి చూపించారని సమాచారం. అయితే దుబాయ్లో ఇషాన్ తన సోదరుడి బర్త్డే పార్టీకీ వెళ్లాడని ఓ టీమిండియా ప్లేయర్ వివరించాడు. కాగా, ఇషాన్ ప్రస్తుతం హార్దిక్ పాండ్యతో కలిసి వడోదరలో సాధన చేస్తున్నాడు.