సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్ గురించి క్రికెట్ ప్రేమికులకు సుపరిచితమే. అన్నదమ్ములైన వారిద్దరు పరుగుల వరద పారించడంలో సిద్ధహస్తులు. అన్న సర్ఫరాజ్ అరంగేట్రం నుంచి ఆకట్టుకుంటున్నాడు. ఇంగ్లండ్ టెస్టు సిరీస్తో టీమిండియాలో ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్ మూడు టెస్టుల్లో 50 సగటుతో 200 పరుగులు చేశాడు. ఈ క్రమంలో బంగ్లాదేశ్తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్లో మొదటి టెస్టుకు ఎంపిక చేసిన భారత జట్టులో తన స్థానాన్ని కాపాడుకున్నాడు.
విరాట్ కోహ్లి రాకతో రజత్ పటిదార్, దేవదత్ పడిక్కల్ వంటి యువ ఆటగాళ్లు చోటు కోల్పోయినప్పటికీ సర్ఫరాజ్ స్థానం దక్కించుకున్నాడు. అయితే సర్ఫరాజ్ టీమిండియాలో చోటు సంపాదించినప్పటికీ తుదిజట్టులో ఛాన్స్ దక్కదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని దృష్టిలో పెట్టుకొని కేఎల్ రాహుల్కు ఛాన్స్ ఇస్తామని, సర్ఫరాజ్ను బ్యాకప్ బ్యాటర్గా మాత్రమే చూస్తున్నామని పేర్కొన్నాయి.

సర్ఫరాజ్ తనకి వచ్చిన అవకాశాల్ని గొప్పగా సద్వినియోగం చేసుకున్నాడని, కానీ బంగ్లా సిరీస్ కోసమే కాకుండా ఆస్ట్రేలియా సిరీస్ను దృష్టిలో పెట్టుకుని తుదిజట్టు కూర్పు సిద్ధం చేస్తామని బీసీసీఐ వర్గాలు చెప్పాయి.ఎవరైనా బ్యాటర్కు గాయమైతే, సర్ఫరాజ్ ఎంపిక తొలి ప్రాధాన్యత అని తెలిపాయి. ఈ నేపథ్యంలో దులీప్ ట్రోఫీలో సర్ఫరాజ్ ఆడతాడని బీసీసీఐ అధికారికంగా పేర్కొంది.
అయితే జట్టులో చోటు దక్కినప్పటికీ తుదిజట్టులో గ్యారెంటీ లేక అన్న సర్ఫరాజ్ నిరాశలో ఉండగా.. తమ్ముడు ముషీర్ ఖాన్కు బీసీసీఐ బంపరాఫర్ ఇవ్వడానికి సిద్ధమైంది. ముషీర్ ఖాన్ను భారత్-ఏ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయనుంది. దులీప్ ట్రోఫీలో ఇండియా-బీ తరఫున ఆడుతున్న ముషీర్ ఇటీవల ఇండియా-ఏతో జరిగిన మ్యాచ్లో భారీ శతకంతో (181) సత్తాచాటిన సంగతి తెలిసిందే. 19 ఏళ్ల ఈ బ్యాటర్ను మరింత రాటు దేల్చడానికి ఆస్ట్రేలియా పర్యటనకు పంపడానికి బీసీసీఐ సిద్ధమైంది.