
హైదరాబాద్: దాయాది దేశమైన పాకిస్థాన్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడటంపై మీ నిర్ణయం ఏంటో చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని బీసీసీఐ కోరింది. ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో 2012 నుంచి ఇరు దేశాల మధ్య క్రికెట్ సిరీస్లు జరగని సంగతి తెలిసిందే.
పాకిస్థాన్తో మ్యాచ్లు ఆడే విషయమై కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం బీసీసీఐ ఎప్పటినుంచో ఎదురుచూస్తోంది. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తేనే పాక్తో ద్వైపాక్షిక సిరిస్లు ఆడతామని కూడా చెబుతోంది. తాజాగా ఇరు దేశాల మధ్య 2014లో కుదిరిన ఒప్పందాన్ని బీసీసీఐ గౌరవించడం లేదని, తమకు 7 కోట్ల డాలర్లు నష్టపరిహారంగా ఇప్పించాలని కోరుతూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఐసీసీని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
దీంతో ఈ వివాదంపై ఐసీసీ వివాదాల పరిష్కార బోర్డు ఎదుట తమ వాదనలు వినిపించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రభుత్వ విధానమేంటో తెలుసుకోవాలని బీసీసీఐ భావించింది. ఈ మేరకు కేంద్రానికి మెయిల్ పంపించింది. దీనిపై ఓ బీసీసీఐకి చెందిన ఉన్నతాధికారి ఒకరు స్పందించారు.
'ఇది బోర్డు తరఫున సాధారణంగా జరిగే ప్రక్రియే. ద్వైపాక్షిక సిరీస్ల విషయంలో ప్రభుత్వ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. మా పని ప్రభుత్వాన్ని అడగటం వరకే. అనుమతి ఇవ్వాలా వద్దా అన్నది ప్రభుత్వం ఇష్టం. ప్రస్తుత పరిస్థితుల్లో ద్వైపాక్షిక సిరీస్ కష్టమేనని మాకూ తెలుసు. అయితే ఇదే సమాచారం ప్రభుత్వం నుంచి వస్తే మాకు ఉపయోగపడుతుంది' అని అన్నారు.
బీసీసీఐ 2014లో తమతో కుదుర్చుకున్న ఫ్యూచర్ టూర్స్ అండ్ ప్రోగ్రామ్(ఎఫ్టీపీ)ని గౌరవించడం లేదంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ వివాద పరిష్కార కమిటీని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో భాగంగా తటస్థ వేదికలో పాకిస్థాన్తో ఇండియా కనీసం రెండు సిరీస్లు ఆడాల్సి ఉంది.
అయితే, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పాక్తో ద్వైపాక్షిక సిరిస్లు ఆడేందుకు భారత్ సిద్ధంగా లేదు. దీంతో ముగ్గురు సభ్యుల కమిటీ పాక్ బోర్డు వేసిన పిటిషన్పై ఐసీసీ విచారణ జరపనుంది. ఈ కమిటీ కమిటీ ఛైర్మన్గా మైఖెల్ బెలోఫ్ క్యూసీ వ్యవహారించనున్నారు. ఈ విషయంలో కమిటీ నిర్ణయమే ఫైనల్ అని ఇప్పటికే ఐసీసీ స్పష్టం చేసింది. అక్టోబర్ 1 నుంచి 3 మధ్య దుబాయ్లో ఈ విచారణ జరగనుంది.