
హైదరాబాద్: బీసీసీఐకి సుప్రీం కోర్టు ఊహించని షాకిచ్చింది. ఐపీఎల్లో ఒకప్పటి జట్టు కోచి టస్కర్స్ కేరళకు అనుకూలంగా గతంలో సుప్రీంకోర్టు ప్యానల్ ఇచ్చిన 'ఆర్బిట్రల్ అవార్డు'ను నిలిపివేయాలని బీసీసీఐ సుప్రీం కోర్టుని కోరిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై స్టే కావాలంటే వెంటనే రూ. 100 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.
కాంట్రాక్ట్ను ఉల్లంఘించిందన్న ఆరోపణలతో కోచి టస్కర్స్ కేరళ(కేటీకే) ఫ్రాంఛైజీని 2011లో బీసీసీఐ రద్దు చేసింది. ఆ తర్వాత బీసీసీఐ ఆరు నెల్లలో బ్యాంక్ గ్యారెంటీ సమర్పించాలని కేటీకే ఫ్రాంఛైజీని ఆదేశించింది. ఈ విషయంలో కేటీకే విఫలం కావడంతో అంతకముందు కేటీకే చెల్లించిన రూ. 156 కోట్లను బ్యాంకు గ్యారెంటీ కింద బీసీసీఐ సొంతం చేసుకుంది.
దీనిపై కేటీకే యాజమాన్యం బీసీసీఐ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన సర్వోన్నత న్యాయస్థానం 2015లో కేటీకేకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది. కేటీకే వాదనలు విన్న ఆర్సీ లహోటీ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ప్యానెల్ రూ.550 కోట్లను 18 శాతం వార్షిక జరిమానాతో కేటీకేకు చెల్లించాలని బీసీసీఐని ఆదేశించింది.
దీంతో కేటీకే ఫ్రాంఛైజీకి చెల్లించాల్సిన రూ.550 కోట్లు కాస్తా రూ.800 కోట్లు అయింది. సుప్రీం కోర్టు ఆదేశాలపై బీసీసీఐ బాంబే హైకోర్టును ఆశ్రయించి సెక్షన్ 34 అప్లికేషన్ను కోర్టు ముందు ఉంచింది. దీంతో బాంబే హైకోర్టు ఆర్బిట్రల్ అవార్డుపై బేషరతుగా స్టే విధించింది. దీంతో కేటీకే ప్రాంఛైజీ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
తాజాగా శుక్రవారం కీటీకే వాదనలు విన్న జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ ఇందు మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం కోచి టస్కర్స్ కేరళ అనుకూలంగా తీర్పు వెలువరించింది. దీంతో పాటు ఆర్బిట్రల్ అవార్డుపై స్టే కావాలంటే రూ.100 కోట్లు తక్షణమే చెల్లించాలని బీసీసీఐని ఆదేశించింది. దీంతోపాటు సెక్షన్ 34ను తొలగించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.