
ముంబై: టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత టీమిండియా హెడ్ కోచ్ ఎవరనే ప్రశ్నకు అధికారికంగా తెరపడింది. భారత హెడ్ కోచ్గా టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ నియమితులయ్యారు. టీమిండియా కోచ్గా ద్రవిడ్ను నియమిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం అధికారికంగా ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ తర్వాత న్యూజిలాండ్ జట్టుతో జరగనున్న సిరీస్కు మిస్టర్ డిపెండబుల్ కోచ్గా వ్యవహరించనున్నారు. టీమిండియా ప్రధాన కోచ్గా ద్రవిడ్ రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. టీ20 ప్రపంచకప్ తర్వాత ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం ముగియనున్న విషయం తెలిసిందే.
టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకుంటున్న విషయం తెలిసిందే. రవిశాస్త్రి పదవీకాలం నవంబరు 14తో ముగియనుంది. ప్రపంచకప్ తర్వాత న్యూజీలాండ్ పర్యటనతో టీమిండియా కోచ్గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్గా ద్రవిడ్ ఉన్నారు. ఆ బాధ్యతల నుంచి ఆయన త్వరలోనే తప్పుకొనున్నారు. అయితే భారత హెడ్ కోచ్గా ఉండడానికి ముందుగా ద్రవిడ్ ఒప్పుకోలేదు. బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ రంగంలోకి దిగడంతో ద్రవిడ్ ఒప్పుకోకతప్పలేదు.
భారత జట్టుకు విదేశీ కోచ్ వచ్చే అవకాశమే లేదని బీసీసీఐ ముందునుంచి చెపుతోంది. ఇప్పుడు అదే నిజమైంది. గతంలో నలుగురు విదేశీయులు భారత జట్టు కోచ్గా చేశారు. జాన్ రైట్, గ్రెగ్ చాపెల్, గ్యారీ కిర్స్టెన్, డంకన్ ఫ్లెచర్ కోచ్లుగా ఉన్నారు. ఇందులో కిర్స్టెన్ సక్సెస్ అయ్యాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడి హయాంలోనే భారత్ 2011 వన్డే ప్రపంచకప్ గెలుచుకుంది. ఇక 2016 నుంచి టీమిండియాకు స్వదేశీ కోచ్ ఉంటున్న విషయం తెలిసిందే. రవిశాస్త్రి రెండు పర్యాయాలు చేశాడు. ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ వంతు వచ్చింది.
ఇప్పటికే అనేక మంది యువ ఆటగాళ్లు అండర్-19 స్థాయిలో రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలోనే మేటి ఆటగాళ్లుగా తయారైన సంగతి తెలిసిందే. కొందరు ప్లేయర్స్ ఇప్పుడు భారత జట్టులోనూ ఆడన్నారు. టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి కాంట్రాక్ట్ ముగుస్తున్న నేపథ్యంలో చాలా మంది ద్రవిడ్నే తర్వాతి కోచ్గా నియమించాలంటూ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే సౌరవ్ గంగూలీ, జై షా అతడిని ఒప్పించారు. మరోవైపు ద్రవిడ్ ఇటీవల శ్రీలంక పర్యటనలోనూ భారత జట్టు కోచ్గా సేవలందించిన సంగతి తెలిసిందే. గతంలో ఇండియా-ఏ జట్టుకు, శ్రీలంకలో పర్యటించిన టీమిండియాకు ద్రవిడ్ కోచ్గా వ్యవహరించారు.