దాదాపు మూడేళ్ల తర్వాత బీసీసీఐ వార్షిక అవార్డుల ఫంక్షన్ను నిర్వహించనుంది. ఈ వేడుకకు హైదరాబాద్ను వేదికగా ఎంపిక చేసింది. ముంబయి వేదికగా 2020 జనవరిలో చివరిసారిగా బీసీసీఐ అవార్డుల ఫంక్షన్ నిర్వహించింది. కరోనా లాక్డౌన్కు రెండు నెలల ముందుగా జరిగిన ఈ వేడుకలో 2018-19 క్రికెట్ ఏడాదికి గానూ అవార్డులను అందజేసింది.
మెన్స్ క్రికెట్లో జస్ప్రీత్ బుమ్రా, ఉమెన్స్ విభాగంలో పూనమ్ యాదవ్ 2020లో పాలీ ఉమ్రిగర్ అవార్డు అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లు పాలీ ఉమ్రిగర్ అవార్డుకు ఎంపిక చేస్తారు. అలాగే సీకే నాయుడు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును కృష్ణమాచారి శ్రీకాంత్, అంజుమ్ చోప్రాకు ప్రదానం చేశారు. ఈ అవార్డును మాజీ ఆటగాళ్లకు బీసీసీఐ అందించే అత్యున్నత గౌరవం.

కాగా, ఈ సారి బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుకను జనవరి 23న హైదరాబాద్లో నిర్వహించేలా ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఈ ఫంక్షన్కు టీమిండియాతో పాటు ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు హాజరుకానున్నారు. అయిదు టెస్టుల సిరీస్లో భాగంగా జనవరి 25 నుంచి ఉప్పల్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు జరగనుంది. అవార్డుల వేడుక సమయానికి ఇంగ్లాండ్ ఆటగాళ్లు హైదరాబాద్లోనే ఉంటారనే ఉద్దేశంతో వారిని కూడా వేడుకకు ఆహ్వానించనున్నారు.
బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుక గురించి బోర్డు కార్యదర్శి జైషా అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు లేఖ రాశారు. ''ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం దేశంలోని అత్యుత్తమ క్రికెటర్ల విజయాలను గుర్తించి వారిని గౌరవించే వేదిక. బీసీసీఐ వార్షిక అవార్డులకు మా గుండెల్లో ఎప్పటికీ ప్రత్యేక స్థానామే.అవి అద్భుతమైన క్రికెట్ పట్ల శ్రేష్ఠత, అంకితభావం, అభిరుచికి ప్రతీకగా నిలుస్తాయి. క్రికెట్ హీరోలను అందించడంలో మీరు చేసిన సహకారానికి ధన్యవాదాలు'' అని జైషా పేర్కొన్నాడు.
కాగా, స్వదేశంలో అఫ్గానిస్థాన్తో భారత్ మూడు టీ20ల సిరీస్ను ఆడనుంది. మొహాలి వేదికగా రేపు రాత్రి 7 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. దాదాపు 14 నెలల తర్వాత తిరిగి టీ20 జట్టులోకి వచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సిరీస్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. మరోవైపు జూన్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ ముందు భారత్ తలపడే ఆఖరి టీ20 సిరీస్ ఇదే కావడం గమనార్హం.