బీసీసీఐకి కొత్త లీడ్ స్పాన్సర్ దొరికేసింది. ఈ ఏడాది సెప్టెంబరు వరకు ఒప్పందం ఉన్నా కూడా ప్రముఖ ఎడ్యుకేషనల్ సంస్థ బైజూస్ ఈ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. మార్కెటింగ్ ఖర్చులను కారణంగా చూపిన బైజూస్.. తాము టీమిండియా లీడ్ స్పాన్సర్గా ఉండటం లేదని ప్రకటించింది. ఇదే సమయంలో టీమిండియా టూల్ కిట్ స్పాన్సర్ కూడా మారిపోయింది.
ఇంతకుముందు ఎంపీఎఎల్ కంపెనీ ఈ టూల్ కిట్ స్పాన్సర్షిప్ చేసింది. కానీ తాజాగా ప్రముఖ స్పోర్టింగ్ కంపెనీ ఆదిదాస్తో ఐదేళ్లకు బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలోనే లీడ్ స్పాన్సర్గా కూడా ఎక్కువ కాలం ఉండే కంపెనీతోనే డీల్ చేసుకోవాలని అనుకుంటూ వచ్చింది. ఈ నిర్ణయంతో స్పాన్సర్షిప్ టెండర్లు కూడా ఆలస్యంగా విడుదల చేసింది. ఈ మధ్యలో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడిన భారత్.. లీడ్ స్పాన్సర్ లేకుండానే బరిలో దిగింది.

ఈ నేపథ్యంలో తాము టీమిండియా లీడ్ స్పాన్సర్గా డ్రీమ్11తో ఒప్పందం చేసుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. 'భారత్లోని అతిపెద్ద ఫాంటసీ స్పోర్ట్స్ గేమింగ్ వేదిక అయిన డ్రీమ్11.. టీమిండియా స్పాన్సర్ అని ప్రకటిస్తున్నందుకు బీసీసీఐ చాలా సంతోషిస్తోంది. మూడేళ్లపాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది' అని బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. అంటే ఇక నుంచి టీమిండియా జెర్సీలపై డ్రీమ్11 లోగో ఉంటుందన్నమాట.
వెస్టిండీస్తో జరిగే టెస్టు సిరీస్ నుంచే ఈ కొత్త డీల్ అమల్లోకి వస్తున్నట్లు సమాచారం. అంటే విండీస్ టూర్ నుంచి భారత జెర్సీలపై డ్రీమ్11 పేరు ఉంటుంది. ఈ సందర్భంగా బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ మాట్లాడుతూ డ్రీమ్11 సంస్థకు కంగ్రాట్స్ చెప్పాడు. 'బీసీసీఐ అఫీషియల్ స్పాన్సర్ నుంచి ఇప్పుడు లీడ్ స్పాన్సర్గా మారిన డ్రీమ్11కు శుభాకాంక్షలు. ఈ డీల్తో బీసీసీఐతో డ్రీమ్11 అనుబంధం మరింత బలోపేతమైంది' అని తెలిపాడు.