శ్రీలంక పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఊహించనట్లుగానే నయా కోచ్ గౌతమ్ గంభీర్ మార్క్ జట్టుపై స్పష్టంగా కనిపించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ సీనియర్ల ఆటగాళ్లను కొనసాగిస్తూ యువకులకు అవకాశం ఇచ్చింది. టీ20లకు సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా నియమించింది.
జట్టులో కొనసాగుతున్నప్పటికీ హార్దిక్ పాండ్యకు సారథి బాధ్యతలు అందివ్వలేదు. వైస్ కెప్టెన్గానూ హార్దిక్ ఎంపికలేదు. ఇటీవల జింబాబ్వే పర్యటనను విజయవంతంగా ముగించిన యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేయడం గమనార్హం. స్టాండ్బై కెప్టెన్గా గిల్ సిద్ధం చేస్తున్నట్లు బీసీసీఐ పరోక్షంగా వెల్లడించింది.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుండటంతో వన్డే జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కొనసాగారు. తొలుత రోహిత్, కోహ్లిలకి విశ్రాంతి ఇస్తారని భావించినా మెగాటోర్నీని దృష్టిలో పెట్టుకుని లంక పర్యటనకు వారిద్దరు ఎంపికయ్యారు. జస్ప్రీత్ బుమ్రాకు మాత్రం విశ్రాంతి ఇచ్చారు. అయితే హార్దిక్ పాండ్య వన్డే జట్టుకు ఎంపిక కాలేదు. అతనికి విశ్రాంతి ఇచ్చారా? జట్టు నుంచి తప్పించారా అనే విషయంపై బీసీసీఐ వివరణ ఇవ్వలేదు.
టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చిన రవీంద్ర జడేజా కూడా వన్డేలకు సెలక్ట్ కాలేదు. మరోవైపు ఇటీవల జింబాబ్వే పర్యటనలో సత్తాచాటిన రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మకు టీ20 జట్టులో అవకాశం ఇవ్వలేదు. పరుగుల వరద పారిస్తూ రుతురాజ్ ఆకట్టుకున్నాడు. మెరుపు శతకంతో అభిషేక్ రికార్డులను షేక్ చేశాడు. కానీ వీరిద్దరిపై వేటు పడింది. పంత్ రాకతో టీ20 జట్టులో శాంసన్ మాత్రమే వికెట్ కీపర్గా ఎంపికయ్యాడు. ధ్రువ్ జురెల్, జితేశ్ శర్మకు నిరాశే ఎదురైంది.
కాగా, శాంసన్ వన్డే జట్టులో చోటు కోల్పోయాడు. గత వన్డే సిరీస్లో శాంసన్ సెంచరీ సాధించాడు. కానీ జట్టుతో తన స్థానాన్ని ఇప్పటికీ సుస్థిరం చేసుకోలేకపోయాడు. యశస్వీ జైస్వాల్కి కూడా వన్డే జట్టులో చోటు దక్కలేదు. రియాన్ పరాగ్ మాత్రమే టీ20లతో పాటు వన్డే జట్టులో చోటు సంపాదించాడు. యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా వన్డే జట్టులో స్థానం దక్కించుకోవడం విశేషం. తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డికి నిరాశే మిగిలింది.
టీమిండియా టీ20 జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషభ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్
టీమిండియా వన్డే జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబె, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.