
సౌథాంప్టన్: అందరూ ఊహించినదే నిజమైంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈరోజు ప్రారంభమవ్వాల్సిన ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్కు వరుణుడు అడ్డుపడ్డాడు. మ్యాచ్ ప్రారంభ సమయం దగ్గర పడుతున్న సమయంలో సౌథాంప్టన్లో వర్షం కురుస్తోంది. దీంతో పిచ్తో పాటు గ్రౌండ్లో కొంత భాగాన్ని కవర్లతో కప్పి ఉంచారు. గ్రౌండ్ పరిస్థితిని మ్యాచ్ అధికారులు పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. తొలి సెషన్ను రద్దు చేసినట్లు కూడా బీసీసీఐ మరో ట్వీట్లో స్పష్టం చేసింది.
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కోసం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇప్పటికే టాస్ (మధ్యాహ్నం 2.30) పడాల్సి ఉంది. సౌథాంప్టన్లో ఉదయం భారీ వర్షం పడింది. ఇక టాస్ సమయానికి గంట ముందే మరోసారి వరుణుడు పలకరించాడు. దీంతో పిచ్ను కవర్లతో కప్పి ఉంచారు. గ్రౌండ్ పరిస్థితిని మ్యాచ్ అధికారులు పరిశీలించి.. తొలి సెషన్ను రద్దు చేశారు. ప్రస్తుతం అక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయని సమాచారం. ఇదే పరిస్థితి ఉంటే.. రెండో సెషన్ కూడా తుడిచిపెట్టుకుపోనుంది. లంచ్ బ్రేక్ 5 గంటలకు షెడ్యూల్ అయి ఉంది. ఆ లోపు వరుణుడు కరుణిస్తాడేమో చూడాలి.
పలు వాతావరణ సమాచార వెబ్సైట్ల ప్రకారం సౌథాంప్టన్లో శుక్రవారం 90% వర్షం పడేందుకు ఆస్కారం ఉంది. మధ్యాహ్నం 95%, సాయంత్రం 47%, అర్ధరాత్రి 16% వర్షం కురుస్తుందని పేర్కొంటున్నాయి. మ్యాచ్ జరిగే ఐదు రోజులు వరుణుడు 'టెస్టు మ్యాచ్' ఆడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 'శుక్రవారం మొత్తం ఆకాశంలో మబ్బులు కమ్ముకోవచ్చు. సుదీర్ఘ సమయం వర్షం కురిసే అవకాశం ఉంది. ఉదయం నుంచే ఉరుములు, మెరుపులతో వాన పడేందుకు ఆస్కారం ఉంది. శుక్రవారం ఉదయం 6 నుంచి శనివారం ఉదయం 6 వరకు ఉరుములతో కూడిన వర్షం పడనుంది' అని బ్రిటన్ వాతావరణ శాఖ తెలిపింది.