
హైదరాబాద్: రంజీ ట్రోఫీలో కొత్తగా 9 జట్లు చేరనున్నాయి. ఇప్పటి వరకు 28 జట్లు రంజీ ట్రోఫీలో బరిలో దిగగా ఈ ఏడాది ప్రారంభం కానున్న సీజన్లో మొత్తం 37 జట్లు పోటీపడనున్నాయి. ఈమేరకు 2018-19 దేశవాళీ రంజీ సీజన్ షెడ్యూల్ను బీసీసీఐ బుధవారం ప్రకటించింది.
రంజీ ట్రోఫీలోకి 9 కొత్త జట్లు చేరడంతో సీజన్లో నిర్వహించే మొత్తం మ్యాచ్ల సంఖ్య భారీగా పెరిగింది. రంజీ ట్రోఫీలో మరోసారి ఎలీట్, ప్లేట్ పద్ధతిని బోర్డు ప్రవేశపెట్టింది. ఎలీట్ గ్రూప్-ఎ, బిలలో తొమ్మిదేసి జట్లు.. గ్రూపు-సిలో 10 జట్లు బరిలో ఉంటాయి.
కొత్తగా చేరిన అరుణాచల్ప్రదేశ్, బిహార్, మణిపూర్, మేఘాలయా, మిజోరాం, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, ఉత్తరాఖండ్ ప్లేట్ గ్రూపులో చోటు సంపాదించాయి. ప్లేట్ గ్రూప్లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధిస్తుంది.
ఆగస్టు 13 నుంచి 20 వరకు జరిగే సీనియర్ మహిళల ఛాలెంజర్ ట్రోఫీతో దేశవాళీ సీజన్ ప్రారంభం కానుంది. ఇరానీ ట్రోఫీ ఫైనల్ ముగిసిన తర్వాత 37 జట్లతో సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ ప్రారంభమవుతుంది. ఐపీఎల్కు సన్నద్దమేయ్యే ఆటగాళ్లకు ఇదొక గొప్ప ప్లాట్ఫామ్ కానుంది.
ఇక, రంజీ ట్రోఫీ నవంబరు 1న ప్రారంభమై.. 2019 ఫిబ్రవరి 6న ముగుస్తుంది. ఇక, సీనియర్ పురుషులు, మహిళలు.. అండర్-16 (బాలబాలికలు) వయోపరిమితి వరకు మొత్తం 2017 మ్యాచ్లు నిర్వహించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.