వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ (వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్) ఫైనల్ చేరిన భారత్.. ఈ కీలక మ్యాచ్ కోసం జట్టును ప్రకటించింది. గతేడాది తొలి డబ్ల్యూటీసీ సైకిల్లో ఫైనల్ చేరిన జట్టు న్యూజిల్యాండ్ చేతిలో ఓడిపోయింది. ఈ ఏడాదిని అంత ఆశాజనకంగా ప్రారంభించకపోయినా కూడా.. అనూహ్యంగా పుంజుకొని, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ను చిత్తు చేసి మరీ ఫైనల్ చేరింది టీమిండియా.
అయితే ఈ కీలకమైన మ్యాచ్ సమయానికి కూడా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టుతో చేరడం లేదు. ఈ లోటు తీరడం భారత్కు చాలా కష్టం. అదే సమయంలో షమీ, సిరాజ్ ఇద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. అతనితోపాటు శార్దూల్ ఠాకూర్ను సెలెక్టర్లు ఈ ఫైనల్ మ్యాచ్కు ఎంపిక చేశారు. శార్దూల్ అవసరం అయితే బంతితో పాటు బ్యాటుతోనూ జట్టుకు అండగా నిలుస్తాడని వాళ్లు నమ్మారు.

అసలు ఫామ్లో లేక చాలా ఇబ్బందులు పడుతున్న కేఎల్ రాహుల్ కూడా ఈ ఫైనల్ ఆడే జట్టుకు ఎంపికయ్యాడు. ఇంగ్లండ్లో అతని రికార్డు బాగుండటంతోనే రాహుల్కు ఈ టీంలో చోటు దక్కినట్లు తెలుస్తోంది. అదే సమయంలో వెన్నునొప్పితో జట్టుకు దూరమైన శ్రేయాస్ అయ్యర్.. శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. టీమిండియాకు కీలకమైన నాలుగో నెంబర్లో బ్యాటింగ్ చేసే అతని స్థానాన్ని భర్తీ చేయడం కూడా పెద్ద సవాలే.
టెస్టులు, వన్డేల్లో సూర్యకుమార్ యాదవ్ను ఈ స్థానంలో ఆడించినా అతను ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇలాంటి సమయంలో వెటరన్ అజింక్య రహానే ఫామ్ అందుకున్నాడు. దేశవాళీల్లో చక్కగా రాణించిన అతను.. తాజాగా ఐపీఎల్లో కూడా ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. దీంతో సెలెక్టర్లు అతనిపై బాగా నమ్మకం ఉంచారు. అతన్ని కూడా డబ్ల్యూటీసీ ఫైనల్కు ఎంపిక చేశారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్