హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్లో భాగంగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి రెండు వన్డేలకు సెలక్టర్లు జట్టుని ప్రకటించారు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో స్పిన్నర్ అక్షర్ పటేల్కు సెలక్టర్లు చోటు కల్పించారు.
చెన్నై వేదికగా జరిగిన తొలి వన్డేకు ముందు అక్షర్ పటేల్కు గాయం కావడంతో అతడి స్ధానంలో జడేజాకు చోటు కల్పించారు. అయితే ఇప్పుడు అక్షర పటేల్ తిరిగి కోలుకోవడంతో జడేజాను తప్పించి మళ్లీ అక్షర్కు అవకాశం కల్పించారు. తాజాగా 15 మంది జట్టులో ఇదొక్కటే మార్పు.

ఐదు వన్డేల సిరిస్లో 3-0తో ఇప్పటికే కోహ్లీసేన సిరిస్ను కైవసం చేసుకుంది. ఈ సిరిస్లో భాగంగా సెప్టెంబర్ 28న బెంగళూరులో నాలుగో వన్డే, అక్టోబర్ 1న నాగ్పుర్లో ఐదో వన్డే ఆడనుంది. ఇదిలా ఉంటే ఇండోర్లో సాధించిన ఒక్క విజయం కోహ్లీసేనకు రెండు ఘనతలను తెచ్చిపెట్టింది.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్ధానం కైవసం చేసుకోవడంతో పాటు.. ఆస్ట్రేలియాపై ఐదు మ్యాచ్ల సిరీస్ను మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే 3-0తో కైవసం చేసుకుంది. ఇక ఇప్పుడు కంగారూలపై మిగిలిన ఏకైక లక్ష్యం.. క్లీన్స్వీప్ మాత్రమే. అంతేకాదు ఆస్ట్రేలియాపై ఐదు వన్డేల సిరీస్ను రెండు మ్యాచ్లుండగానే భారత్ గెలవడం ఇదే తొలిసారి.
భారత జట్టు:
Virat Kohli (Captain), Rohit Sharma (vice-captain), KL Rahul, Manish Pandey, Kedar Jadhav, Ajinkya Rahane, MS Dhoni (wicketkeeper), Hardik Pandya, Kuldeep Yadav, Yuzvendra Chahal, Jasprit Bumrah, Bhuvneshwar Kumar, Umesh Yadav, Mohammed Shami and Axar Patel.