
ఆసియా కప్ 2023 విషయంలో బీసీసీఐ, పీసీబీ మధ్య గొడవకు తెర పడినట్లే కనిపిస్తోంది. ఈ ఏడాది పాకిస్తాన్ వేదికగా ఆసియా కప్ జరగాల్సి ఉంది. అయితే భారత జట్టును పాక్కు పంపడం కుదరదని బీసీసీఐ తేల్చిచెప్పింది. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మండిపడింది. భారత్ కనుక ఆసియా కప్ కోసం తమ దేశానికి రాకుంటే.. తాము కూడా వన్డే వరల్డ్ కప్ కోసం భారత్కు జట్టును పంపబోమని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ క్రమంలో బీసీసీఐ, పీసీబీ మధ్య చర్చలు జరిపేందుకు ఐసీసీ, ఏసీసీ రెండూ మధ్యవర్తిత్వం చేసినట్లు సమాచారం.
ఈ రెండు బోర్డుల మధ్య గొడవ చినికి చినికి గాలివానలా మారింది. దీంతో అసలు ఆసియా కప్ ప్రశాంతంగా జరుగుతుందా? అని అభిమానులు ఆందోళన చెందారు. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు సరిగా లేకపోవడంతో ద్వైపాక్షిక సిరీసులు జరగడం లేదు. దీంతో భారత్, పాకిస్తాన్ జట్లు కేవలం ఆసియా కప్, ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. కానీ ఈ గొడవ వల్ల ఆసియా కప్తోపాటు కీలకమైన వన్డే వరల్డ్ కప్లో కూడా అభిమానులు ఎదురు చూసే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగేలా కనిపించలేదు.
అయితే తాజాగా ఈ విషయంలో రెండు బోర్డులు ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆసియా కప్ 2023 మొత్తం పాకిస్తాన్లోనే జరగాలని ఈ రెండు బోర్డులు నిర్ణయించాయట. కానీ భారత్తో జరిగే మ్యాచులు మాత్రం తటస్థ వేదికలో నిర్వహించాలని రెండు బోర్డుల ప్రతినిధులు భావిస్తున్నారు. ఈ విషయంపై పీసీబీ, బీసీసీఐ రెండూ ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీని కోసం తటస్థ వేదికను ఎంపిక చేసే పనిలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఆసియా కప్లో భారత్ ఆడే మ్యాచులు నిర్వహించేందుకు యూఏఈ, ఒమన్, శ్రీలంక, ఇంగ్లండ్ దేశాలు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ఏదో ఒక వేదికలో భారత మ్యాచులు నిర్వహించేందు రెండు బోర్డులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆసియా కప్లో కనీసం ఐదు మ్యాచులు ఈ వేదికలో జరుగుతాయని తెలుస్తోంది. అలాగే భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే కనీసం రెండు మ్యాచులు ఈ వేదికల్లో జరిగేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇప్పటి వరకైతే ఏ వేదికలో ఈ మ్యాచులు నిర్వహించాలని ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని సమాచారం.