స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య టీమ్ లో ఎంతో కీలక ప్లేయర్. అతడు వన్డే ప్రపంచకప్ ఫైనల్ లో ఆడి ఉంటే భారత్ విశ్వవిజేతగా నిలిచేదేమో అంటే అతియోశక్తి కాదు! అంతలా హార్దిక్ జట్టుకు సమతూకంగా నిలుస్తాడు. కానీ మెగాటోర్నీలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో గాయపడి జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత షమి రాకతో, టీమిండియా బ్యాటర్లు నిలకడగా ఆడటంతో హార్దిక్ లోటు ఎక్కడా కనిపించలేదు. కానీ, ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ అనంతరం క్రికెట్ విశ్లేషకులు హార్దిక్ ఉంటే భారత జట్టు మరింత బలంగా ఉండేదని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఫైనల్ లో టీమిండియాకు ఆరో బౌలర్ లేకపోవడం, విరాట్ కోహ్లి-కేఎల్ రాహుల్ విలువైన భాగస్వామ్యాన్ని భారీ స్కోరుగా మార్చాడానికి సరైన బ్యాటర్ లేకపోవడం ఓటమికి ప్రధాన కారణాలు అయ్యాయి.
అయితే గాయపడిన హార్దిక్ పాండ్య గురించి బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మరో ఆరు నెలల్లో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో హార్దిక్ పూర్తి ఫిట్ నెస్ సాధించేలా ప్రణాళిక రచించింది. ఫైనల్ వరకు చేరి వన్డే కప్ ను కోల్పోయిన టీమిండియా ఈ సారి పొట్టి కప్ ను సాధించాలని కసితో ఉంది. అందుకు పొట్టి సమరానికి హార్దిక్ అందుబాటులో ఉండేలా సుమారు 18 వారాల పాటు NCAతో పాటు బీసీసీఐ అతడిని పర్యవేక్షించనుంది. అయితే ఈ సారి హార్దిక్ హెల్త్ గురించి ప్రతిరోజు అప్డేట్ ను అధికారులు కోరనున్నట్లు సమాచారం. మొత్తంగా మార్చిలోపు ఈ స్టార్ ఆల్ రౌండర్ మైదానంలో పూర్తి ఫిట్ నెస్ తో అడుగుపెట్టేలా ప్లాన్ వేసింది బీసీసీఐ.

మరోవైపు హార్దిక్ ఇంకా పూర్తిగా కోలుకోకముందే గత వారం రోజులుగా అతడి గురించే వార్తలు చక్కర్లు కొట్టాయి. గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ తిరిగి ముంబయి ఇండియన్స్ గూటికి చేరడంపై పెద్ద ఎత్తున చర్చలు సాగాయి. గుజరాత్ టైటాన్స్ను రెండు సార్లు ఫైనల్స్కు చేర్చడమేగాక, 2022లో హార్దిక్ జట్టును విజేతగా కూడా నిలిపాడు. కానీ అనూహ్యంగా అంత విలువైన ఆటగాడిని గుజరాత్ ముంబయికి అప్పగించడంపై క్రికెట్ వర్గాలు షాక్ అయ్యాయి.
2015లో ముంబయి ఇండియన్స్ తరఫున హార్దిక్ ఐపీఎల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. 2015 వేలంలో హార్దిక్ ను బేసిక్ ప్రైజ్ రూ.10 లక్షలకు ముంబయి సొంతం చేసుకుంది. ఆ తర్వాత హార్దిక్ లైఫ్ ఛేంజ్ అయిపోయింది. అద్భుత ప్రదర్శన చేస్తూ స్టార్ ఆల్ రౌండర్ గా మారిపోయాడు.