భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన సూపర్ -12 మ్యాచ్ కాంట్రవర్సీలకు వేదికగా మారింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ ఓటమి చవి చూసింది. అయితే ఈ ఓటమిని బంగ్లా జట్టు జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలోనే కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడని, దీని వల్ల అంపైర్లు తమకు అదనంగా ఐదు పరుగులు ఇవ్వాల్సిందని బంగ్లాదేశ్ జట్టు వైస్ కెప్టెన్ నురుల్ హసన్ ఆరోపించాడు. అయితే మ్యాచ్ సమయంలో కోహ్లీ చర్యలను అటు అంపైర్లుకానీ, ఇటు క్రీజులోని బ్యాటర్లు కానీ ఎవరూ గమనించలేదు. దీంతో దాని గురించి చర్చ జరగలేదు. కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత బంగ్లాదేశ్ జట్టు ఐదు పరుగుల తేడాతో ఓడింది. దీంతో నురుల్ హసన్ ఈ విషయాన్ని లేవనెత్తాడు. తమకు అన్యాయం జరిగిందని వాపోయాడు.
టైం కావాలన్నా..
ఈ మ్యాచ్లో ఛేజింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు తమ ఇన్నింగ్స్ను ధాటిగా ఆరంభించింది. లిటన్ దాస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అలాంటి సమయంలో మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో బంగ్లా లక్ష్యాన్ని కుదించారు. అయితే మ్యాచ్ మళ్లీ ప్రారంభించే సమయంలో బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంపైర్లతో మాట్లాడుతూ.. అవుట్ ఫీల్డ్ తడిగా ఉందని, దాన్ని ఆరబెట్టేందుకు మరికొంత టైం తీసుకోవాలని షకీబల్ అన్నాడట. కానీ అంపైర్లు వినలేదు.
బంగ్లా బోర్డు గుర్రు..
భారత్ చేతిలో బంగ్లా జట్టు ఓటమి తర్వాత వార్తల్లో నిలిచిన అంశాలే ఈ రెండు. కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్పై ఇప్పటికే పలువురు స్పందించారు. అసలు ఇది ఎవరూ చూడలేదని, కాబట్టి దానికి పెనాల్టీ ఎలా వేస్తారని కొందరు ప్రశ్నించారు. అలాగే మ్యాచ్ ఎప్పుడు ప్రారంభించాలనే నిర్ణయం అంపైర్లదేనని, దాన్ని ఎవరూ మార్చలేరని బంగ్లా అభిమానులకు హితవు పలికారు. కానీ బంగ్లా క్రికెట్ బోర్డు మాత్రం ఈ విషయంలో సంతృప్తిగా లేదు. ఈ రెండు అంశాలపై అధికారిక వేదికలపై ఫిర్యాదు చేస్తామని బీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ చైర్మన్ జలాల్ యూనిస్ స్పష్టం చేశారు. ఈ విషయంపై తాము సమాలోచనలు జరుపుతున్నామని, త్వరలోనే సంబంధిత ఫోరంలో ఫిర్యాదు చేస్తామని తేల్చిచెప్పారు.