
కరాచీ: పాకిస్తాన్లో జరిగే రెండు టెస్టుల సిరీస్కు తమ జట్టును పంపడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) నిరాకరించింది. పాకిస్తాన్ గడ్డపై ఎట్టి పరిస్థితుల్లోనూ ద్వైపాక్షిక టెస్టు సిరీస్ ఆడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. అయితే టీ20 సిరీస్ ఆడటానికి మాత్రం బీసీబీ అంగీకరించింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీం ఖాన్ బుధవారం స్పష్టం చేశారు.
వసీం ఖాన్ బుధవారం మాట్లాడుతూ... 'జనవరి-ఫిబ్రవరిలో ప్రణాళిక ప్రకారం పాకిస్తాన్లో టెస్టులు ఆడటానికి బంగ్లా రావాలి. అయితే టెస్టు సిరీస్ ఆడటానికి బంగ్లాదేశ్ ఒప్పుకోలేదు. కేవలం టీ20 సిరీస్ ఆడుతామని చెప్పారు. పాకిస్తాన్లో టెస్టులు ఆడటానికి ఇష్టపడకపోవడానికి గల బలమైన కారణాలను వివరించమని బీసీబీకి లేఖ రాశా' అని తెలిపారు. తమ దేశంలో జరగాల్సిన మ్యాచ్లను తటస్థ వేదికలపై నిర్వహించడానికి పీసీబీ సుముఖంగా లేదని కూడా తెలిపారు.
'పాకిస్తాన్లో భద్రతాపరమైన ప్రణాళికల్ని ఇప్పటికే ఐసీసీ అంగీకరించింది. దీన్ని తమ దేశానికి వచ్చే విదేశీ క్రికెట్ బోర్డులు దృష్టిలో పెట్టుకోవాలి. ముందుగా తమ దేశంలో టెస్టు సిరీస్ ఆడటానికి బీసీబీ ఆమోదం తెలిపినా.. ఆ తర్వాత అందుకు నిరాకరించడం బాధ కల్గించింది. బీసీబీతో ఇంకా చర్చలు జరుపుతున్నాం' అని వసీం ఖాన్ తెలిపారు.
ఇటీవల పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన శ్రీలంక క్రికెట్ జట్టు ముందుగా వన్డే, టీ20 సిరీస్లు ఆడింది. సెప్టెంబర్-అక్టోబర్లో పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక సిరీస్ ఆడిన శ్రీలంక.. మళ్లీ టెస్టు సిరీస్ ఆడటానికి పాకిస్తాన్లో అడుగుపెట్టింది. ఇదే తరహాలో బంగ్లాదేశ్ కూడా అంగీకారం తెలుపుతుందనే ఆశాభావంతో పీసీబీ పెద్దలు ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
తమ దేశంలో క్రికెట్ను బతికించాలంటూ పీసీబీ చేసిన విజ్ఞప్తిని మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) మన్నించింది. ఈ మేరకు ఎంసీసీ నుంచి ఒక జట్టును పాకిస్తాన్ పర్యటనకు పంపడానికి సిద్దమయింది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో లాహోర్కు జట్టును పంపడానికి అంగీకరించింది. ఎంసీసీ జట్టుకు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర నేతృత్వం వహించనున్నాడు.