ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు
మంగళవారం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఆసియా XI కోసం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. అయితే ఆసియా XI జట్టులో ఏకంగా ఆరుగురు భారత ఆటగాళ్లకు బీసీబీ చోటిచ్చింది. భారత్ నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఓపెనర్ శిఖర్ ధావన్, పేసర్ మహ్మద్ షమీ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, కీపర్ రిషబ్ పంత్, ఓపెనర్ లోకేష్ రాహుల్లకు బీసీబీ అవకాశం ఇచ్చింది. రాహుల్ కేవలం ఒక మ్యాచ్కే ఎంపిక చేయబడ్డాడు. అయితే కోహ్లీ ఎంపికపై కాస్త గందరగోళం నెలకొంది.
మార్చి 18న మ్యాచ్
ఆసియా ఎలెవన్, వరల్డ్ ఎలెవన్ మధ్య మొదటి మ్యాచ్ మార్చి 18న జరగనుంది. ఇక అదే రోజు దక్షిణాఫ్రికాతో భారత్ చివరి వన్డేలో తలపడనుంది. దీంతో ఆరుగురు భారతీయ ఆటగాళ్లు ఆసియా ఎలెవన్ జట్టులో ఎలా ఆడుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే మార్చి 21న జరగనున్న రెండో మ్యాచ్కు ఆరుగురు ఆటగాళ్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇక భారత్ నుంచి నలుగురు క్రికెటర్లని పంపుతారని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గతంలో నిర్ణయించగా.. మరో ఇద్దరు అదనంగా చోటు దక్కించుకున్నారు.
బంగ్లా నుండి నలుగురు
ఆరుగురు భారత ఆటగాళ్లతో పాటు మిగతా ఆసియా దేశాల నుండి స్టార్ ఆటగాళ్లకు బీసీబీ చోటిచ్చింది. అయితే ఆసియా ఎలెవన్ జట్టులో ఒక్క పాకిస్థాన్ ప్లేయర్ కూడా లేడు. ఎందుకంటే.. పాక్ ఆడితే మేం ఆడం అని బీసీసీఐ ప్రకటించింది కాబట్టి. బంగ్లాదేశ్ నుండి తమీమ్ ఇక్బాల్, లిటన్ దాస్, ముష్ఫికర్ రహీమ్, ముస్తఫిజుర్ రెహ్మాన్ ఆసియా ఎలెవన్ జెర్సీని ధరించనున్నారు.
నేపాల్ ఆటగాడికి చోటు
శ్రీలంక నుండి సీనియర్ ఆటగాళ్లు తిసారా పెరెరా, లసిత్ మలింగలు ఆసియా ఎలెవన్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు స్పిన్నర్లు రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్.. నేపాల్ ఆటగాడు సందీప్ లామిచనేకు అవకాశం దక్కింది. రషీద్, ముజీబ్, సందీప్, కుల్దీప్ స్పిన్ బౌలింగ్ భారం మోయనున్నారు. మలింగ, షమీ, పెరెరా, ముస్తఫిజుర్ పేస్ భాద్యతలు పంచుకోనున్నారు.
అధికారికంగా టీ20 హోదా
షేక్ మజీబుర్ రహ్మన్ వందో జయంతి వేడుకల సందర్భంగా ఈ టీ20 సిరీస్ని నిర్వహించబోతున్నట్లు గత ఏడాది బంగ్లాదేశ్ ప్రకటించింది. ఐసీసీ అనుమతిని బీసీబీ కోరగా.. అధికారికంగా టీ20 హోదాని ఇచ్చింది.
ఆసియా XI జట్టు:
లోకేష్ రాహుల్, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, మొహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, లిటన్ దాస్, తమీమ్ ఇక్బాల్, ముష్ఫికర్ రహీమ్, తిసారా పెరెరా, రషీద్ ఖాన్, ముస్తఫిజుర్ రెహ్మాన్, సందీప్ లామిచనే, లసిత్ మలింగ, ముజీబ్ ఉర్ రెహ్మాన్.