
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్పై తాను ఎప్పుడూ ఆందోళన చెందలేదని చెప్పాడు. కోహ్లీ బ్యాటింగ్లో బాగా శ్రమిస్తాడని చెప్పిన రాథోడ్ అందుకే మైదానంలో రాణిస్తున్నాడని తెలిపాడు. ఈ సందర్భంగా సౌతాఫ్రికాతో కేప్టౌన్ వేదికగా జరగుతున్న మూడో టెస్టులో కోహ్లీ రాణించడం పట్ల బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ సంతోషం వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లీని ఔట్ చేయడానికి సౌతాఫ్రికా బౌలర్లు రకరకాల బంతులు వేశారని, అయినప్పటికీ ఎక్కడా సహనం కోల్పోకుండా విరాట్ ఏకాగ్రతతో ఆడాడని కోనియాడాడు. చాలా క్రమశిక్షణగా ఓపికతో బ్యాటింగ్ చేశాడని అన్నాడు. అన్ని బంతులను ఆడకుండా వదిలేయాల్సినవి వదిలేసి, సరైన బంతులను ఎంచుకుని ఆడాడని తెలిపాడు. మంచి కవర్ డ్రైవ్లు ఆడాడని చెప్పాడు. అతని బ్యాటింగ్లో ఎక్కడా లోపాలు కనిపించలేదని తెలిపాడు. కోహ్లీ బ్యాటింగ్ తీరుపై సంతృప్తిగా ఉన్నట్లు విక్రమ్ రాథోడ్ వెల్లడించాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో మొత్తంగా 201 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 12 ఫోర్లు, ఒక సిక్స్తో 79 పరుగులు సాధించాడు.
ఇక చటేశ్వర్ పుజారా, అజింక్య రహానే బ్యాటింగ్ తీరు గురించి కూడా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ స్పందించాడు. పుజారా ఈ మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడని అన్నాడు. రహానే కూడా వీలైనంత వరకు మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. జోహన్నెస్బర్గ్ వేదికగా జరిగిన సెకండ్ టెస్ట్ మ్యాచ్లో పుజారా, రహానే కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడారని రాథోడ్ గుర్తు చేశాడు. అయితే త్వరలోనే పుజారా, రహానే భారీ ఇన్నింగ్స్లు ఆడతారని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్లో 77 బంతులు ఎదుర్కొన్న పుజారా 7 ఫోర్లతో 43 పరుగులు చేయగా, 12 బంతులు ఎదుర్కొన్న రహానే 9 పరుగులకే ఔటయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలి ఇన్నింగ్స్లో ఫేలవంగా బ్యాటింగ్ చేశామని రాథోడ్ అన్నాడు. ఇంకో 50-60 పరుగులు చేయాల్సిందని తెలిపాడు.
కాగా కేప్టౌన్ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో కెప్టెన్ కోహ్లీ మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ రాణించకపోవడంతో టీమిండియా 223 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా రెండో రోజ ఆటలో లంచ్ బ్రేక్ సమయానికి 3 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. క్రీజులో 40 పరుగులతో పీటర్సన్, 17 పరుగులతో డస్సెన్ ఉన్నారు.