
హైదరాబాద్: ఫిరోజ్ షా కోట్లా వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టెస్టులో జట్టు కొన్ని తప్పిదాలను చేసిందని, వాటిని సరిదిద్దుకోవాల్సి ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. మూడో టెస్టు మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ చివరి టెస్టులో టీమిండియా కొన్ని తప్పిదాలు చేసిందని అంగీకరించాడు.
చివరి రోజైన బుధవారం 7 వికెట్లు పడగొడితే భారత్ గెలిచే అవకాశం ఉన్నా.. బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా కొన్ని తప్పిదాలు చేయడం వల్లే మ్యాచ్ డ్రా అయిందని కోహ్లీ అన్నాడు. బుధవారం మూడు సెషన్లలో కలిపి మొత్తం 87 ఓవర్లు బౌలింగ్ చేసిన భారత్ బౌలర్లు రెండు వికెట్లు మాత్రమే తీయడం విశేషం.
'వ్యక్తిగతంగా ఈ సిరీస్ నాకు చాలా కీలకం. మునుపటి ఫామ్ని అందుకోగలిగాను. ఇదే ఫామ్ని వన్డేల్లోనూ కొనసాగించాలని ఆశిస్తున్నా. జట్టు కొన్ని తప్పిదాలను చేసింది.. వాటిని సరిదిద్దుకోవాల్సి ఉంది. బ్యాటింగ్, బౌలింగ్లో ఫర్వాలేదనిపించినా.. ఫీల్డింగ్లో మాత్రం ఇంకా కొంత మెరుగవ్వాలి. ముఖ్యంగా స్లిప్ ఫీల్డింగ్లో' అని కోహ్లీ అన్నాడు.
గత రెండేళ్లుగా తాను సుదీర్ఘ క్రికెట్ ఆడానని, అందుకే తన శరీరం విశ్రాంతి కోరుకుంటోందని అన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకి ముందు విశ్రాంతి తీసుకోవాలని భావించానని కోహ్లీ అన్నాడు. దీంతో ఆసక్తికరంగా సాగిన ఈ టెస్టు మ్యాచ్ చివరికి బుధవారం డ్రాగా ముగియడంతో మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ను 1-0తో భారత్ కైవసం చేసుకుంది.