ఇంగ్లాండ్ చేతిలో తొలి టెస్టు ఓటమి అనంతరం భారత్ మరో మ్యాచ్కు సిద్ధమైంది. అయిదు టెస్టుల సిరీస్లో భాగంగా విశాఖపట్నం వేదికగా శుక్రవారం నుంచి రెండో టెస్టు ఆడనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ను సమం చేయాలని రోహిత్ సేన కసితో సన్నద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ విలేకరుల సమావేశానికి హాజరై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటిదార్లలో ఒకరికే తుదిజట్టులో అవకాశం దక్కుతుందని పేర్కొన్నాడు. అలాగే వరుసగా విఫలమవుతున్న శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ జట్టులో కొనసాగుతారని పరోక్షంగా తెలిపాడు.
'' వారిద్దరిలో (సర్ఫరాజ్, రజత్) ఒకరినే ఎంచుకోవడమనేది కఠినమైన ఎంపిక. వారిద్దరూ అద్భుతమైన ఆటగాళ్లే. దేశవాళీలో గత కొన్నేళ్లుగా గొప్పగా రాణిస్తున్నారు. వారు జట్టుకు మరింత విలువను జోడిస్తారు. అయితే ఎంపికపై తుది నిర్ణయం ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకుంటారు. ఇక వైజాగ్ పిచ్ను అంచనా వేయడం అంత తేలిక కాదు. తొలి రోజు నుంచి అయినా టర్న్ అవ్వొచ్చు లేదా క్రమంగా స్పిన్కు అనుకూలించవచ్చు''

''మా జట్టులో టెస్టు క్రికెట్ పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లు ఉన్నారు. వారికి కాస్త సమయం ఇవ్వాలి. శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైశ్వాల్ భారీ స్కోరులు సాధిస్తారని నమ్ముతున్నాను. అయితే అటాకింగ్గా ఆడటానికి, ఉద్దేశపూర్వకంగా షాట్లు ఆడటానికి తేడా ఉంటుంది. మా బ్యాటర్లు పరిస్థితులకు తగ్గట్లుగా ఉద్దేశంతో షాట్లు ఆడాలని కోరుకుంటున్నాను. పరుగులు చేసే అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి''

''వికెట్, పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలి. ఆ షాట్ సురక్షితమా కాదా అని నిర్ధారించుకునే తెలివితేటలు బ్యాటర్లుకు ఉండాలి. అయితే షాట్లు ఆడుతూ పరుగులు చేయడానికి మద్దతు ఇస్తాను. ఎందుకంటే వాళ్ల బలాన్ని వాళ్లు నమ్మాలి. గతకొన్నేళ్లుగా భారత్లో టీమిండియా విజయాలు సాధించడానికి బ్యాటర్లది కీలకపాత్ర. ఇక్కడ బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు'' అని బ్యాటింగ్ విక్రమ్ రాథోర్ అన్నారు. ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో మన బ్యాటర్లు భారీషాట్లకు యత్నించి ఔటైన విషయం తెలిసిందే. అయితే రెండో ఇన్నింగ్స్లో అతిజాగ్రత్తకు వెళ్లి వికెట్లు సమర్పించుకున్నారు.