పాకిస్థాన్ క్రికెట్లో సీనియర్లు, ప్రస్తుత ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ముఖ్యంగా టీ20 ప్రపంచ కప్లో భారత్పై పాకిస్థాన్ ఓడిపోయిన తర్వాత మాజీ ఆటగాళ్లు ప్రస్తుత జట్టును తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ చేసిన ఓ కామెంట్ పాక్ మాజీ దిగ్గజాలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
అసలేం జరిగిందంటే?
భారత్తో జరిగిన మ్యాచ్లో ఓటమి తర్వాత బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిద్, షాదాబ్ ఖాన్లను జట్టు నుంచి తొలగించాలని మాజీలు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన షాదాబ్ ఖాన్.. "విమర్శించడం అనేది మా చేతుల్లో లేదు. మాజీ ఆటగాళ్లకు వారి సొంత అభిప్రాయాలు ఉంటాయి. వారు లెజెండ్స్ కావచ్చు, కానీ మేము చేసిన పనిని వారు కూడా చేయలేకపోయారు. ప్రపంచకప్లో మేము భారత్ను ఓడించాం (2021లో). విమర్శలు క్రికెట్ చరిత్రలో భాగమే." అని వ్యాఖ్యానించాడు. తాము 2021 టీ20 ప్రపంచకప్లో భారత్ను ఓడించామని, గతంలోని లెజెండ్స్ ఆ పని చేయలేకపోయారని షాదాబ్ పరోక్షంగా ఎద్దేవా చేశాడు.

షాదాబ్ మాటలకు బాసిత్ అలీ ఘాటు కౌంటర్
షాదాబ్ వ్యాఖ్యలపై పాక్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ టీవీ షోలో నిప్పులు చెరిగారు. షాదాబ్ ఖాన్ మామగారైన దిగ్గజ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ను ఉదాహరణగా తీసుకుంటూ బాసిత్ అలీ షాకింగ్ కామెంట్స్ చేశారు. "సక్లయిన్ మ్యాచ్ విన్నర్ కాదా? సక్లయిన్ లాంటి బౌలర్ జేబులో షాదాబ్ లాంటి వాళ్లు 10 మంది ఉండేవారు. ఇప్పుడున్నది ఒక్కడే.. కానీ పదిమంది ఉన్నా సక్లయిన్ ముందు తక్కువే. 90వ దశకంలో లేదా 2000వ దశకంలో ఆటగాళ్లు కేవలం పెర్ఫార్మెన్స్ చూసి సెలెక్ట్ అయ్యేవారు, సిఫార్సులతో కాదు." అని బాసిత్ అలీ మండిపడ్డారు.
సిఫార్సులతోనే జట్టులోకి..
ప్రస్తుత కోచ్ మైక్ హెస్సన్కు షాదాబ్ ఆప్తుడన్న ఉద్దేశంతో బాసిత్ అలీ మరిన్ని విమర్శలు చేశారు. "చిన్న జట్లు (నమీబియా వంటివి) వచ్చినప్పుడు బ్యాటింగ్ ఆర్డర్లో ముందు వరుసలో వస్తాడు. అదే భారత్ లాంటి పెద్ద జట్లపై ఒక ఓవర్లో 17 పరుగులు ఇచ్చి కనీసం ఫీల్డింగ్ కూడా సరిగ్గా చేయలేడు. జట్టులో ఇంజమామ్ లేదా వకార్ యూనిస్ ఉంటే ఇలాంటి ప్రయోగాలు జరిగేవి కావు" అని విమర్శించారు.
మొబైల్ ఫోన్ల వివాదం
గతంలో పాకిస్థాన్ 'ఏ' జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళినప్పుడు జరిగిన ఓ సంఘటనను బాసిత్ అలీ గుర్తు చేసుకున్నారు. "షాదాబ్ ఎప్పుడూ మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయేవాడు. నేను అతని దగ్గర ఉన్న రెండు మొబైల్ ఫోన్లను లాక్కుని, ఫోన్ వాడకూడదని ఆజ్ఞాపించాను" అని బాసిత్ అలీ వెల్లడించారు. మైదానంలో ఫోన్లు వాడటం నిషిద్ధం కావడంతో షాదాబ్ ఏదైనా అక్రమాలకు పాల్పడుతున్నాడా అనే అనుమానాలను బాసిత్ అలీ కామెంట్స్ రేకెత్తిస్తున్నాయి.