అంతర్జాతీయ క్రికెట్ లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. వరుస ఓటములతో .. సొంత దేశ క్రికెట్ అభిమానులు, మాజీల చేతుల్లో విమర్శలకు గురౌతుంది. అందరూ దారుణంగా ఆ జట్టును తిడుతోన్నారు. ఈ క్రమంలోనే తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్, కోచ్ బసిత్ అలీ కూడా.. పాకిస్థాన్ ప్రదర్శనపై తీవ్రంగా వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్ పై 4-1 తేడాతో టీ20 సిరీస్ ఓడిన తర్వాత.. తాజాగా జరిగిన తొలి వన్డేలోనూ పాకిస్థాన్ ఓడిపోవడంతో బసిత్ అలీ విమర్శలు గుప్పించాడు.
అతడిని బూట్లతో కొట్టాలి..
ఈ తొలి వన్డేలో బాబర్ అజామ్, రిజ్వాన్ బ్యాటింగ్ ఆర్డర్ ను ప్రశ్నించాడు బసిత్ అలీ. ఛాంపియన్స్ ట్రోఫీలో ఓపెనింగ్ చేసిన బాబర్.. దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే తాజాగా అతడు మూడో స్థానంలో బరిలోకి దిగాడు. దీని గురించే బసిత్ అలీ మాట్లాడుతూ... "బాబర్ ఎందుకు మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాలి?. ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు ఓపెనింగ్ చేశాడు. అసలు ఎవరా క్రికెట్ ప్రొఫెసర్స్?, ఎక్కడ ఉన్నారు?.. బాబర్ ను ఆ స్థానంలో బ్యాటింగ్ దింపింది. వాళ్లు దేశానికి క్షమాపణలు చెప్పాలి. ఇప్పుడు ఎవరూ బయటకు రారు. ఇలా క్రికెట్ ప్రొఫెసర్స్ అవ్వాలనుకునేవారిని బూట్లతో కొట్టాలి" అని బసిత్ అలీ సహనాన్ని కోల్పోయి మండిపడ్డాడు.

అతడే బాధ్యత వహించాలి...
జట్టులో అంతర్గత పోరు, సమస్యలు ఉన్నాయని మరోసారి నొక్కి చెప్పాడు బసిత్ అలీ. "పాకిస్థాన్ క్రికెట్ నాశనమవ్వడానికి బాధ్యుడు.. బాబర్, రిజ్వాన్ ను ఓపెనర్లుగా పంపినవాడే. పాకిస్ఠాన్ టీమ్.. ఓ ఫ్రాంఛైజీ టీమ్ గా మారిపోయింది." జట్టు త్వరగా పుంజుకోవాలి అని చెప్పుకొచ్చాడు.