టెస్టు క్రికెట్లో సంచలనం నమోదైంది. పాకిస్థాన్పై బంగ్లాదేశ్ చారిత్రక విజయాన్ని సాధించింది. పాక్పై బంగ్లా తొలిసారి టెస్టు సిరీస్ను గెలిచింది. రెండు టెస్టుల సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. రావల్పండి వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య జట్టు పాకిస్థాన్ను బంగ్లాదేశ్ ఆరు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.
మరోవైపు సొంతగడ్డపై పాకిస్థాన్ వరుసగా పదో టెస్టులో విజయం సాధించలేకపోయింది. వర్షం కారణంగా లేదా బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఓటమి నుంచి తప్పించుకోవాలనుకున్న పాక్కు నిరాశే మిగిలింది. కాగా,ఓవర్నైట్ స్కోరు 42/0తో అయిదో రోజు 185 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది.

ముష్ఫికర్ రహీమ్ (22 నాటౌట్, 51 బంతుల్లో, 1 ఫోర్), షకిబ్ అల్ హసన్ (21 నాటౌట్, 43 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఓపెనర్ జకీర్ హసన్ (40; 39 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. ఇవాళ ఆట ఆరంభమైన కాసేపటికే బంగ్లా ఓపెనర్లను కోల్పోయింది. కానీ ఒత్తిడికి లోనుకాకుండా బంగ్లాదేశ్ బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడి జట్టును గెలిపించారు.
పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్లో 274 స్కోరు చేసింది. సయిమ్ అయుబ్ (58; 110 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. మెహదీ హసన్ అయిదు వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్లో 262 పరుగులకు ఆలౌటైంది. 26/6తో కష్టాల్లో ఉన్న జట్టును లిటన్ దాస్ (138; 228 బంతుల్లో, 13 ఫోర్లు, 4 సిక్సర్లు) గొప్పగా ఆదుకున్నాడు. పాక్ బౌలర్లలో ఖురమ్ ఆరు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం రెండో ఇన్నింగ్స్లో పాక్ 172 పరుగులకే కుప్పకూలింది. అఘా సల్మాన్ (47 నాటౌట్) టాప్ స్కోరర్. హసన్ మహ్మద్ అయిదు వికెట్లు తీశాడు. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.