హైదరాబాద్: జింబాబ్వేతో రెండు టెస్టుల సిరీస్ను సమం చేయడానికి బంగ్లాదేశ్కు ఇంకో 8 వికెట్లు కావాలి. బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో జింబాబ్వే క్రమంగా ఓటమికి చేరువవుతోంది. బంగ్లా నిర్దేశించిన 443 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే దిశగా జింబాబ్వే బుధవారం బరిలోకి దిగింది. భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 76 పరుగులు చేసింది.
బ్రెండన్ టేలర్ (4 బ్యాటింగ్), విలియమ్స్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. బారా చారి (43), మసకద్జా (25) ఓ మాదిరిగా ఆడారు. ఒక్క రోజు ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్లో జింబాబ్వే గెలువాలంటే ఇంకా 367 పరుగులు చేయాలి.
అంతకుముందు కెప్టెన్ మహ్ముదుల్లా (122 బంతుల్లో 101 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ సెంచరీ చేశాడు. ఇలా బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ను 54 ఓవర్లలో 6 వికెట్లకు 224 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. మహ్మద్ మిథున్ (67) పరుగులతో రాణించాడు. ఆరంభంలో జింబాబ్వే బౌలర్లు చెలరేగడంతో బంగ్లా 25 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.
అయితే మిథున్, మహ్మదుల్లా ఐదో వికెట్కు 118 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను ఆదుకున్నారు. చివర్లో మెహిది హసన్ (27 నాటౌట్) వేగంగా ఆడాడు. జార్విస్, ట్రిపానో చెరో రెండు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్లో బంగ్లా.. జింబాబ్వేపై భారీ ఆధిక్యంతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆ ఇన్నింగ్స్లో బంగ్లా 522/7 వద్ద డిక్లేర్ చేయగా.. జింబాబ్వే 304 పరుగులకు ఆలౌటైంది.