ఢాకా: ఇటీవలి కాలంలో చాలా మ్యాచ్లకు అడ్డంకిగా మారిన వరణుడు ముక్కోణపు టీ20 సిరీస్ ఫైనల్కు కూడా అడ్డుపడ్డాడు. బంగ్లాదేశ్-అఫ్ఘానిస్థాన్ జట్ల మధ్య మంగళవారం జరగాల్సిన ముక్కోణపు టీ20 సిరీస్ ఫైనల్ మ్యాచ్ ఒక్కబంతి పడకుండానే వర్షంతో రద్దయింది. ఈ ఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డే లేకపోవడంతో బంగ్లా-అఫ్ఘాన్ జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. రెండు కన్నా ఎక్కువ జట్లు పోటీపడ్డ టోర్నీల్లో.. ట్రోఫీ నెగ్గడం బంగ్లాకు ఇదే మొదటిసారి. అఫ్ఘాన్ బ్యాట్స్మన్ 'రహమనుల్లా గుర్బాజ్' మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.
సంచలన స్పెల్.. 3 మెయిడిన్లు సహా మూడు వికెట్లు.. తొలి టీ20లో భారత్ ఘన విజయం
మంగళవారం స్థానిక సమయం ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. ఉదయం నుండి ఢాకాలో ఆకాశం మేఘావృతమై ఉంది. వర్షం మ్యాచ్కు అడ్డుపడుతుందని అందరూ బావించినట్టుగానే.. మ్యాచ్ ప్రారంభానికి గంట ముందు (ఐదు గంటల) నుంచి భారీ వర్షం పడడంతో మైదానం తడిసి ముద్దయింది. దీంతో మొదటగా టాస్ ఆలస్యమైంది. ఆ తర్వాత కూడా మరోసారి వర్షం పడడంతో ఆటకు వీలుకాలేదు. దాంతో మ్యాచ్ను రద్దు చేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు.
లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్లలో బంగ్లా మూడు గెలిచి.. ఒకటి ఓడిపోయింది. మరోవైపు అఫ్ఘాన్ రెండు గెలిచి.. రెండు ఓడిపోయింది. ఇక మూడో జట్టు అయిన జింబాబ్వే ఒక మ్యాచ్ గెలిచింది. ఫైనల్లో ఆఫ్ఘాన్ కెప్టెన్, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆడే అవకాశం కనిపించలేదు. బంగ్లాదేశ్తో సెప్టెంబర్ 21 జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో రషీద్ గాయపడ్డాడు. బంగ్లా లక్ష్య చేధనలో భాగంలో ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో ఫీల్డింగ్ చేస్తున్న రషీద్ గాయపడ్డాడు. చికిత్స చేసినా గాయంలో మార్పు లేకపోవడంతో కీలకమైన ఫైనల్కు అతడు అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది.
అయితే ఈ టోర్నీ ద్వారా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతూ తన పేరిట టీ20ల్లో రికార్డుని నెలకొల్పాడు జింబాబ్వే కెప్టెన్ హామిల్టన్ మసకద్జ. ఆప్ఘనిస్థాన్తో జరిగిన మ్యాచ్లో మసకద్జ 42 బంతుల్లో 71 పరుగులు చేయడంతో పాటు తన ఖాతాలో అరుదైన రికార్డుని నెలకొల్పాడు. టీ20 క్రికెట్లో ఓ ఆటగాడి ఫేర్వెల్ మ్యాచ్లో హామిల్టన్ మసకద్జ సాధించిన 71 పరుగులకే ఇప్పటివరకు అత్యధికం కావడం విశేషం. అంతేకాదు ఈ మ్యాచ్లో జింబాబ్వే 7 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో టీ20ల్లో ఆప్ఘన్ 12 వరుస విజయాల ఆల్ టైమ్ రికార్డుకు బ్రేక్ పడింది.