కోల్కతా: ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచులో స్వల్ప స్కోరుకే బంగ్లాదేశ్ చేతులెత్తేసింది. తమ ముందు న్యూజిలాండ్ ఉంచిన 146 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శనివారం 15.4 ఓవర్లలో 70 పరుగులు చేసి బంగ్లాదేశ్ ఆలవుట్ అయింది.
కివీస్ బంగ్లాదేశ్పై 75 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ విజయంతో న్యూజిలాండ్ వరుసగా నాలుగు విజయాలను దక్కించుకుంది. న్యూజిలాండ్ బౌలర్ల ముందు బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ ఎవరూ నిలదొక్కులేకపోయారు. శువగత హోం చేసిన 16 పరుగులే బంగ్లాదేశ్ ఇన్నింగ్సులో అత్యధిక వ్యక్తిగత స్కోరు.
కివీస్ బౌలర్లలో ఇలియోట్, సోధీ మూడేసి వికెట్లు తీసుకోగా, మెక్కుల్లం, సంత్నార్, మెక్క్లెగాన్లకు తలో వికెట్ దక్కాయి. ఈ టోర్నమెంటులో బంగ్లాదేశ్ వరుసగా నాలుగు పరాజయాలను చవి చూసింది.
ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా శనివారం బంగ్లాదేశ్పై జరిగిన మ్యాచులో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి దూకుడు ప్రదర్శించలేకపోయింది.
ఇప్పటికే న్యూజిలాండ్ సెమీ ఫైనల్కు చేరుకోగా, మూడు మ్యాచులు ఓడిపోయి పోటీ నుంచి బంగ్లాదేశ్ తప్పుకుంది. న్యూజిలాండ్ ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించి పట్టికలో అగ్రభాగాన నిలిచింది. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లో విలియమ్సన్ (42), మన్రో (35), టైలర్ (28) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.
మిగతా బ్యాట్స్మెన్ నికోలస్, (7), అండర్సన్ (0), ఇలియోట్ (9), రోంచీ (9 నాటౌట్), సంత్నార్ (3), మెక్కుల్లం (0), మెక్క్లెగాన్ (6 నాటౌట్) పెద్దగా రాణించలేకపోయారు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రహ్మాన్ ఐదు వికెట్లు తీశాడు. మొర్తాజా ఒక వికెట్ పడగొట్టగా, హొస్సేన్కు రెండు వికెట్లు లభించాయి.