
ఢాకా: వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2021 కోసం ఆయా దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం (సెప్టెంబర్ 8) టీమిండియా 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. తాజాగా బంగ్లాదేశ్ కూడా పొట్టి ప్రపంచకప్లో పాల్గొనే జట్టును ప్రకటించింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (బీసీబీ) 15 మందితో కూడిన ప్రాబబుల్స్ను ఈరోజు (సెప్టెంబర్ 9) ప్రకటించింది. మహ్మదుల్లా కెప్టెన్గా వ్యవహరించనున్న ఈ జట్టులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో పాల్గొన్న ఆటగాళ్లకే బీసీబీ తొలి ప్రాధాన్యం ఇచ్చింది.
షీకీబ్ ఆల్ హసన్, ముష్ఫీకర్ రహీమ్, లిట్టన్ దాస్, సౌమ్య సర్కార్, ముస్తాఫిజుర్ రెహ్మన్ లాంటి ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోగా.. బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్కు మాత్రం బీసీబీ మొండిచేయి చూపింది. గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న తమీమ్ను బీసీబీ పరిగణలోకి తీసుకోలేదు. ఇక సీనియర్ ఫాస్ట్ బౌలర్ రూబెల్ హుస్సేన్ రిజర్వ్ బెంచ్కే పరిమితం చేయడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. న్యూజిలాండ్తో జరిగిన హోమ్ సిరీస్ కోసం జట్టులో ఉన్నా.. రూబెల్ను మాత్రం పరిగణించకపోవడం గమనార్హం. 31 ఏళ్ల హుస్సేన్ ఇప్పటివరకు 28 టీ20లు ఆడాడు. న్యూజిలాండ్లో ఈ ఏడాది ఏప్రిల్లో పొట్టి ఫార్మాట్లో చివరిసారిగా జాతీయ జట్టు తరపున ఆడాడు.
ఇటీవల ఆస్ట్రేలియాపై సౌమ్య సర్కార్ పేలవమైన ప్రదర్శన అతడి ఎంపికపై ప్రభావం చూపలేదు. అందుకు కారణం తమీమ్ ఇక్బాల్ అందుబాటులో లేకపోవడమే. తమీమ్ స్థానాన్ని భర్తీ చేసేందుకు సౌమ్య సర్కార్కు బీసీబీ మరో ఛాన్స్ ఇచ్చింది. ఈ ఎడమ చేతి వాటం ఆల్ రౌండర్ ఆస్ట్రేలియాపై ఐదు ఇన్నింగ్స్లలో కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు న్యూజిలాండ్తో జరిగిన మొదటి నాలుగు మ్యాచుల్లో అతడు బరిలోకి దిగలేదు. ఇక స్టాండ్ బై ప్లేయర్స్గా రూబెల్ హుస్సెన్, అమినుల్ ఇస్లామ్ బిప్లాబ్లను ఎంపిక చేసింది.
ఇటీవలే ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ను కైవసం చేసుకున్న బంగ్లాదేశ్ .. తాజాగా కివీస్పై టీ20 సిరీస్ను గెలుచుకునే పనిలో ఉంది. ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకున్న బంగ్లా.. చివరి టీ20ని గెలిచి 4-1తో ఘనంగా ముగించాలని భావిస్తోంది. అయితే బంగ్లాదేశ్ సూపర్ 12లో ఎంటర్ కావాలంటే ముందుగా క్వాలిఫయర్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. క్వాలిఫయింగ్ దశలో గ్రూఫ్ బిలో బంగ్లాదేశ్తో పాటు స్కాట్లాండ్, పపువా న్యూ జినియా, ఒమన్ ఉన్నాయి. ఇక గ్రూఫ్ ఏలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా ఉన్నాయి. ప్రస్తుత బంగ్లా ఫామ్ చూస్తే.. సూపర్ 12లోకి కచ్చితంగా రానుంది. అక్టోబర్ 17న స్కాట్లాండ్తో తమ తొలి మ్యాచ్లో బంగ్లా టీం తలపడనుంది. ఈ మ్యాచ్తోనే టోర్నమెంట్ ప్రారంభంకానుంది.
బంగ్లాదేశ్ టీ20 ప్రపంచకప్ జట్టు:
మహ్మదుల్లా (కెప్టెన్), నయీమ్ షేక్, సౌమ్య సర్కార్, లిట్టన్ కుమార్ దాస్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొసైన్, నూరుల్ హసన్ సోహన్, షాక్ మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మన్, షోరిఫుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, షైఫ్ ఉద్దీన్, షైఫ్ ఉద్దీన్, షామిమ్ ఉద్దీన్.
స్టాండ్ బై ప్లేయర్స్: రూబెల్ హుస్సేన్, అమీనుల్ ఇస్లాం బిప్లాబ్.