హైదరాబాద్: అంతర్జాతీయ టీ20 కెరీర్కు బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ మష్రఫే మొర్తజా వీడ్కోలు పలికాడు. శ్రీలంకతో మంగళవారం తొలి టీ20 మ్యాచ్కు ముందు మొర్తజా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న సిరీసే తనకు ఆఖరని అతను పేర్కొన్నాడు.
మంగళవారం శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్ ముందు ఫేస్బుక్లో రిటైర్మెంట్ ప్రకటించాడు. యువకులకు అవకాశం కల్పించాలని తాను తప్పుకుంటున్నట్టు పేర్కొన్నాడు. 'బంగ్లాదేశ్కు గత పదేళ్లుగా టీ20ల్లో ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది. బంగ్లా ఇదే జోరుతో మున్ముందు ఆడాలని కోరుకుంటున్నా' అని మొర్తజా చెప్పాడు.

'టీ20ల నుంచి వైదొలిగేందుకు ఇదే సరైన సమయం అనుకుంటున్నా. ఈ నిర్ణయంతో ప్రతిభ గల యువ క్రికెటర్లకు అవకాశం దక్కుతుంది' అని తన అధికారిక ఫేస్బుక్ పేజీలో మొర్తజా పేర్కొన్నాడు. 2006లో జింబాబ్వేపై అరంగేట్రం చేసిన 33 ఏళ్ల మొర్తజా తన కెరీర్లో 52 టీ20 మ్యాచ్లాడి 39 వికెట్లతో పాటు 368 పరుగులు సాధించాడు.
బంగ్లాదేశ్ తరుపున 52 టీ20 మ్యాచ్లకు సారథిగా ఉన్న మొర్తజా తొమ్మిది మ్యాచ్ల్లో ఆ జట్టుకు విజయాన్ని సాధించాడు. గాయాలు కారణంగా 2009లో టెస్టు మ్యాచ్లకు దూరమైన మొర్తజా ఆ తర్వాత ఆస్ట్రేలియాలో వరుస శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు.
ఏప్రిల్ 6వ తేదీన కొలంబోలో శ్రీలంకతో జరిగే టీ20 మ్యాచ్ మొర్తజాకు చివరి టీ20 మ్యాచ్ కానుంది. టీ20లకు వీడ్కోలు పలికినప్పటికీ, వన్డేల్లో మాత్రం కెప్టెన్గా కొనసాగనున్నట్లు స్పష్టం చేశాడు.