న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్ష పదవికి ముస్తఫా కమల్ రాజీనామా చేశారు. ఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అనంతరం ఛైర్మన్ శ్రీనివాసన్పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
అసలు ఐసీసీలో శ్రీనివాసన్ పాత్రేమిటో తెలపాలని ఆయన ఐసీసీపై మండిపడ్డారు. శ్రీనివాసన్ వల్ల ఐసీసీ ప్రతిష్ట మంటగలుస్తోందని ముస్తఫా వ్యాఖ్యానించారు. ఐసీసీ అంటే ఇండియన్ క్రికెట్ కౌన్సిల్గా మారిపోయిందని గతంలో ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్కు చెందిన ముస్తఫా కమల్ ఇటీవల ఐసీసీ వరల్డ్ కప్లో తీసుకున్న నిర్ణయాలపై తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. ఐసీసీ వరల్డ్ కప్లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్ధాన్కు చెందిన అంఫైర్ అలీందార్ తీసుకున్న తప్పుడు నిర్ణయం కారణంగా తన దేశ జట్టు ఓటమిపాలైందని ముస్తఫా కమల్ వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు.

ఆ తర్వాత అంఫైర్లపై కఠిన చర్యలు తీసుకోని పక్షంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు కూడా వెనుకాడబోనని కూడా అయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ముస్తఫా కమల్ తన పదవికి రాజీనామా చేశారు.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ట్రోపీ బహుకరించే విషయంలోనూ ఐసీసీ ఛైర్మన్, ఐసీసీ అధ్యక్షుడికి మధ్య విభేదాలు బయటపడ్డాయి. అనంతరం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో ఏం జరుగుతుందో బాహ్య ప్రపంచానికి తెలియజేస్తానని ఐసీసీ అధ్యక్షుడు ముస్తఫా కమల్ ప్రకటించిన విషయం తెలిసిందే.
2015 జనవరిలో సవరించిన నిబంధనల ప్రకారం గ్లోబల్ ఈవెంట్లలో బహుమతిని ఐసీసీ అధ్యక్షుడే అందించాలని ఉంది. కానీ, చివరి నిమిషంలో ఐసీసీ ఛైర్మన్ శ్రీనివాసన్ రంగ ప్రవేశం చేసి ఆస్టేలియా జట్టుకు ఐసీసీ ట్రోఫీని అందజేశారు. దీనిపై ముస్తఫా కమల్ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.
'ట్రోఫీని ఇవ్వాల్సింది నేను. ఐసీసీ రాజ్యాంగం నాకు అందించిన హక్కు అది. దురదృష్టవశాత్తు అందుకు నన్ను అనుమతించలేదు. నా హక్కులను కాలరాశారు. స్వదేశం (బంగ్లాదేశ్) వెళ్లిన తర్వాత, ఐసీసీలో ఏం జరుగుతోందన్న విషయం అందరికీ తెలియచెబుతా. వారి అవకతవకలపై ప్రపంచానికి తేటతెల్లం చేస్తా" అని తెలిపారు.