
హైదరాబాద్: కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్లో బంగ్లాదేశ్ మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. టోర్నీలో భాగంగా బుధవారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో భారత్పై బంగ్లాదేశ్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత మహిళల జట్టుపై బంగ్లాదేశ్ మహిళల జట్టు గెలవడం ఇదే తొలిసారి.
ఫర్గానా హోక్ (52 నాటౌట్) బంగ్లాదేశ్ విజయంలో కీలకపాత్ర పోషించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. హర్మన్ప్రీత్ కౌర్(42), దీప్తి శర్మ(32) ఫరవాలేదనిపించగా, లేని పరుగుకు యత్నించి మిథాలీ రాజ్ (15) రనౌటైంది.
మరో ఓపెనర్ స్మృతి మంధాన (2) ఈ మ్యాచ్లో నిరాశపరిచింది. అనంతరం 142 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 19.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి మరో రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. దీంతో బంగ్లాదేశ్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
దీంతో ఈ టోర్నీలో హ్యాట్రిక్ విజయాలు సాధించాలనుకున్న భారత్ ఆశలకు తెరపడింది. బంగ్లాదేశ్ మహిళా బౌలర్ రుమాన అహ్మద్ 4 ఓవర్లు వేసి 21 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసింది. దీంతో రుమానకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును లభించింది. టోర్నీలో భాగంగా భారత మహిళల జట్టు తన తదుపరి మ్యాచ్లో శ్రీలంకతో తలపడనుంది.
ఈ మ్యాచ్ గురువారం జరగనుంది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండింట్లో విజయాలు సాధించిన టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.