Mushfiqur Rahim: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఇంకా ముగియలేదు. అంతకు ముందే రిటైర్మెంట్లు ప్రారంభమయ్యాయి. సెమీఫైనల్ ఓటమి తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు మరో గొప్ప ఆటగాడు రిటైర్ అయ్యాడు. బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ కూడా వన్డే క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని ఆయన తన ఫేస్బుక్ పేజీలో ప్రకటించాడు.
మనసులో మాటను బయటపెట్టిన రహీమ్
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ ఫేస్బుక్ లో ఇలా రాశాడు.. "ఈ రోజు నుంచి వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. కెరీర్ మొత్తం ఎంతో నిజాయితీతో, అంకితభావంతో దేశానికి ప్రాతినిధ్యం వహించాను . అయితే గత వారం రోజుల్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. 19 ఏళ్లగా మద్దతు ఇచ్చిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు ధన్యవాదాలు. "అని తన మనసులోని మాటను బయటపెట్టాడు.

ముష్ఫికర్ రహీమ్ వన్డే కెరీర్
ముష్పికర్ రహీం 2006 ఆగస్టులో జింబాబ్వేపై వన్డే అరంగేట్రం చేశాడు. ఇప్పుడు వన్డే ఫార్మాట్లో అత్యధిక మ్యాచ్ లు ఆడిన బంగ్లాదేశ్ ఆటగాడిగా నిలిచాడు. రహీమ్ 274 మ్యాచ్ లు ఆడి 36.42 సగటుతో 7,795 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు ఉన్నాయి. ముష్పికర్ రహీం కెరీర్ లో బెస్ట్ స్కోరు 144 పరుగులు. వికెట్ కీపర్ గా 243 క్యాచ్ లు పట్టాడు. స్టంప్స్ వెనుక 56 స్టంపింగ్ లు చేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో కేవలం రెండు పరుగులే చేశాడు..
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ముష్పికర్ రహీమ్ బ్యాటింగ్ లో పూర్తిగా విఫలమయ్యాడు. రెండు మ్యాచ్ లలో రహీమ్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేశాడు. భారత్ తో జరిగిన మ్యాచ్ లో గోల్డెన్ డక్ అయ్యాడు. అక్షర్ పటేల్ తన వికెట్ తీసుకున్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన తన కెరీర్ లోని చివరి మ్యాచ్ లో అతను 2 పరుగులు చేశాడు. ముష్పికర్ రహీమ్ 2022లో టీ20లకు గుడ్ బై పలికారు. ఇక మీద టెస్టులు మాత్రమే ఆడనున్నట్లు తెలుస్తోంది.