ICC Womens World Cup 2025: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో పాకిస్తాన్ జట్టు తమ తొలి మ్యాచ్లోనే ఘోర పరాజయాన్ని చవిచూసింది. బంగ్లాదేశ్ మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ను ఓడించి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పాకిస్తాన్ను 38.3 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌట్ చేశారు.
బంగ్లాదేశ్ తరఫున 20 ఏళ్ల యువ పేసర్ మారుఫా అక్తర్ అద్భుతంగా రాణించింది. ఆమె తొలి ఓవర్లోనే ఓపెనర్ ఓమైమా సోహైల్, సిద్రా అమీన్ను డకౌట్ చేసి పాకిస్తాన్ పతనాన్ని ప్రారంభించింది. ఆ ఓవర్ ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 2 పరుగులకే 2 వికెట్లుగా ఉంది. ఎడమచేతి స్పిన్నర్ నాహిదా అక్తర్ కూడా 19 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ ను మరింత కష్టాల్లోకి నెట్టింది.

బ్యాటింగ్లో ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో రాణించకపోవడంతో పాకిస్తాన్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. రమీన్ షమీమ్(23) టాప్ స్కోరర్గా నిలిచింది. 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ కేవలం 31.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రూబియా హేదర్ 77 బంతుల్లో 8 ఫోర్లతో నాటౌట్ 54 పరుగుల కీలక ఇన్నింగ్స్తో విజయంలో కీలకపాత్ర పోషించింది.
ఆమె కెప్టెన్ నిగర్ సుల్తానా (23) తో కలిసి మూడో వికెట్కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి బంగ్లాదేశ్ను సునాయాసంగా గెలుపు తీరాలకు చేర్చింది.గత 2022 ప్రపంచ కప్లో కూడా పాకిస్థాన్, బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోవడం గమనార్హం. ఈ విజయంతో బంగ్లాదేశ్ టోర్నమెంట్ను ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. మరోవైపు ఓటమి పాలైన పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్ లో ఆదివారం భారత మహిళల జట్టుతో తలపడనుంది. భారత్ ఇప్పటికే తొలి మ్యాచ్లో శ్రీలంకను 59 పరుగుల తేడాతో ఓడించింది.