హైదరాబాద్: బంగ్లాదేశ్ పేసర్ మహమ్మద్ షాహిద్పై ఆ దేశ పోలీసులు కేసు నమోదు చేశారు. గర్భవతిగా ఉన్న సమయంలో తనను వేధింపులకు గురి చేశాడని క్రికెటర్ భార్య ఫర్జానా నారాయణ్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు ఆదేశించారు. వివరాల్లోకి వెళితే ఎనిమిదేళ్ల క్రితం షాహిద్తో ఫర్జానాకు వివాహం అయింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. గతేడాది షాహిద్ భార్య ఫర్జానా ఆడపిల్లకు జన్మనిచ్చింది.

అప్పటి నుంచి ఫర్జానాను షాహిత్ వేధింపులకు గురి చేస్తున్నాడని ఫర్జానా సోదరడు దాలు కాజీ స్ధానిక మీడియాకు వెల్లడించాడు. కుమార్తె పుట్టిన తర్వాత షాహిద్ ప్రవర్తనలో పూర్తిగా మార్పు వచ్చిందని తన అక్కను మరింతగా వేధించడం మొదలు పెట్టాడని తెలిపాడు.
వారం క్రితం తన అక్కను బిల్డింగ్ పైనుంచి తోసి చంపేస్తానని బెదిరించడంతో ఆమె పుట్టింటికి వచ్చినట్లు దాలు కాజీ పేర్కొన్నాడు. అంతేకాదు ఫర్జానా గర్భవతిగా ఉన్నప్పుడు తరచూ ఆమెను వేధించడంతో పాటు పలుమార్లు చేయి కూడా చేసుకున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఫర్జానా కూడా తన భర్త తనను తరచూ వేధించేవాడని పోలీసుల ఎదుట చెప్పింది. 'నేను గర్భవతిగా ఉన్నప్పుడు ఎన్నో సార్లు కొట్టాడు. నన్ను ఎంత వేధించాడో మాటల్లో చెప్పలేను' అని పోలీసుల ఎదుట వాపోయింది. తన భర్తకు వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిపింది.
షాహిద్కు తనని ఇచ్చి పెళ్లి చేసినప్పుడు వాళ్ల కుటుంబం పేదరికంతో అల్లాడుతూ ఉండేదని, కనీసం తనకు బంగారం కొనిచ్చే స్థోమత కూడా వారికి లేదని ఆమె పేర్కొంది. పెళ్లి అయిన రెండేళ్ల పాటు తాము ఎంతో సంతోషంగా ఉన్నామని ఫర్జానా చెప్పింది.
ఆ తర్వాతే తన భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందని, క్రమంగా తనను వేధించడం మొదలుపెట్టాడని పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఇదిలా ఉంటే తనపై వచ్చిన ఆరోపణలను మహమ్మద్ షాహిద్ తోసిపుచ్చాడు.
జరిగిన దానితో పోలిస్తే, తన భార్య ఎక్కువ చేసి చెప్తోందని షాహిద్ పేర్కొన్నాడు. తనని అందరూ పెద్ద క్రికెటర్ అని పిలుస్తారని, అలా పిలవడం వారికి ఇష్టం లేకపోవడంతో తనపై ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని షాహిద్ మండిపడ్డాడు.
ఇదిలా ఉంటే షాహిద్ బంగ్లాదేశ్ తరుపున ఐదు టెస్టులు, ఒక టీ20 ఆడాడు. చివరిసారిగా బంగ్లాదేశ్ తరుపున 2016లో ఆడాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో గాయం కారణంగా గత కొంతకాలంగా క్రికెట్కు దూరమయ్యాడు.