టీ20 ప్రపంచ కప్ ఆతిథ్యంపై భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఇప్పుడు క్రికెట్ మైదానానికి పాకాయి. రానున్న టీ20 ప్రపంచ కప్కు భారత్ వేదికగా నిలుస్తున్న తరుణంలో ఓ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. తమ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహ్మాన్ను ఐపీఎల్ నుంచి తప్పించడం, భద్రతా కారణాలను సాకుగా చూపుతూ తమ లీగ్ మ్యాచ్లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేస్తోంది.
బంగ్లాదేశ్ డిమాండ్ వెనుక అసలు కారణం?
బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ ఈ విషయంలో ఐసీసీ (ICC)కి లేఖ రాయాలని తమ క్రికెట్ బోర్డును ఆదేశించారు. ఆయన ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించారు. రూ.9.20 కోట్ల ఒప్పందం ఉన్నప్పటికీ.. రాజకీయ కారణాలతో ముస్తాఫిజుర్ను కేకేఆర్ విడుదల చేయడం తమ ఆటగాళ్లను అవమానించడమేనని బంగ్లాదేశ్ భావిస్తోంది. ఒక స్టార్ ఆటగాడికి భారత్లో రక్షణ లేనప్పుడు మొత్తం జాతీయ జట్టు పర్యటించడం క్షేమకరం కాదని వారు వాదిస్తున్నారు.

బంగ్లాదేశ్ ప్రతిపాదించిన షెడ్యూల్ మార్పులు:
ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తన లీగ్ మ్యాచ్లను కోల్కతా, ముంబైలలో ఆడాల్సి ఉంది.
*ఫిబ్రవరి 7: వెస్టిండీస్తో (కోల్కతా)
*ఫిబ్రవరి 9: ఇటలీతో (కోల్కతా)
*ఫిబ్రవరి 14: ఇంగ్లాండ్తో (కోల్కతా)
*ఫిబ్రవరి 17: నేపాల్తో (ముంబై)
పాకిస్థాన్ జట్టు ఇప్పటికే తమ మ్యాచ్లను శ్రీలంకలో ఆడుతున్నందున, తమను కూడా అక్కడికే పంపాలని బంగ్లాదేశ్ కోరుతోంది.
బీసీసీఐ ఘాటు స్పందన:
బంగ్లాదేశ్ డిమాండ్ను బీసీసీఐ (BCCI) తీవ్రంగా తప్పుబట్టింది. ఇది ఏమాత్రం సాధ్యం కాని పని అని కొట్టిపారేసింది. టోర్నమెంట్ ప్రారంభానికి కేవలం నెల రోజులే సమయం ఉంది. ఈ తక్కువ సమయంలో వేదికలను మార్చడం అసాధ్యం. కేవలం మైదానాన్ని మార్చడమే కాకుండా.. ఇతర జట్ల ప్రయాణాలు, హోటల్ బుకింగ్స్, బ్రాడ్కాస్టింగ్ సిబ్బంది నిర్వహణ మళ్ళీ మొదటి నుంచి చేయడం కుదరని పని. ఒక దేశం అడిగిందని మొత్తం టోర్నమెంట్ రూపురేఖలను మార్చడం కుదరదని బీసీసీఐ స్పష్టం చేసింది.