టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి బంగ్లాదేశ్ జట్టు వైదొలగడం ఆ దేశ క్రికెట్ చరిత్రలో ఓ చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. భద్రతా కారణాలను సాకుగా చూపి భారత్లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ సీనియర్ అసిస్టెంట్ కోచ్ మహమ్మద్ సలాహుద్దీన్ మాజీ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ నిర్ణయాల వల్ల ఆటగాళ్ల జీవితాలు, వారి దశాబ్దాల కలలు ఎలా నాశనమయ్యాయో ఆయన ఆవేదనతో వివరించారు.
చెదిరిన 27 ఏళ్ల కల: ప్లేయర్ల 'మెంటల్ కోమా'
బంగ్లాదేశ్ క్రికెట్ లీగ్కు ముందు జరిగిన మీడియా సమావేశంలో సలాహుద్దీన్ అత్యంత భావోద్వేగంతో మాట్లాడారు. ఒక్కో ఆటగాడు వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలో ఆడాలని సగటున 27 ఏళ్ల పాటు కఠోర శ్రమ చేస్తారని.. అలాంటి కలను కేవలం కొన్ని రాజకీయ నిర్ణయాలతో ఒక్క సెకనులో తుడిచిపెట్టేశారని మండిపడ్డారు. ఈ అనాలోచిత నిర్ణయం వల్ల జట్టులోని ఇద్దరు కీలక ఆటగాళ్లు ఐదు రోజుల పాటు 'మెంటల్ కోమా' (తీవ్రమైన మానసిక దిగ్భ్రాంతి) లోకి వెళ్లిపోయారని ఆయన వెల్లడించారు. దేశం కోసం త్యాగాలు చేయడానికి ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నప్పటికీ.. వ్యవస్థ లోపాల వల్ల జరిగిన ఈ వ్యక్తిగత నష్టాన్ని ఎవరు పూడుస్తారని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.

ప్రొఫెసర్ అబద్ధాలు.. ఆసిఫ్ నజ్రుల్పై ఆగ్రహం
ఈ గందరగోళానికి ప్రధాన కారకుడిగా భావిస్తున్న మాజీ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్పై సలాహుద్దీన్ నిప్పులు చెరిగారు. ఢాకా యూనివర్సిటీలో ప్రొఫెసర్ స్థాయి వ్యక్తి అయ్యుండి ఆసిఫ్ నజ్రుల్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు. "మొదట ఇది ప్రభుత్వ నిర్ణయం అని చెప్పారు, ఆ తర్వాత బోర్డు, ఆటగాళ్ల సమిష్టి నిర్ణయం అని మాట మార్చారు. ఒక ఉపాధ్యాయుడు ఇంత బహిరంగంగా యూ-టర్న్ తీసుకోవడం నేను ఊహించలేదు. ఇప్పుడు నేను నా ఆటగాళ్ల ముఖాల్లోకి ఎలా చూడాలి?" అని సలాహుద్దీన్ ప్రశ్నించారు. విద్యావంతులే ఇలాంటి అబద్ధాలు చెబితే సమాజానికి ఎలాంటి సందేశం వెళ్తుందని ఆయన నిలదీశారు.
అసలు ఏం జరిగింది? ఐసీసీ కఠిన నిర్ణయం
భారత్ ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచులను భద్రతా కారణాల వల్ల శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ బోర్డు ఐసీసీని కోరింది. అయితే ఈ ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించడంతో బంగ్లాదేశ్ టోర్నీని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా బంగ్లాదేశ్ స్థానాన్ని స్కాట్లాండ్ జట్టుతో భర్తీ చేశారు. మరోవైపు ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్ను రిలీజ్ చేయడం, భారత్-బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు ఈ వివాదాన్ని మరింత రాజేశాయి. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన బంగ్లాదేశ్, మార్చిలో పాకిస్థాన్తో జరిగే వన్డే సిరీస్తో మళ్లీ రీ-ఎంట్రీ ఇవ్వాలని యోచిస్తోంది.