ఢాకా: టెస్టు క్రికెట్ చరిత్రలోనే బంగ్లాదేశ్ అరుదైన ఘట్టాన్ని నమోదు చేసింది. బంగ్లాదేశ్ తొలిసారిగా ఇంగ్లాండ్ జట్టుని ఓడించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తొలి టెస్టులో విజయానికి అతి దగ్గరగా వచ్చి చివర్లో ఓడిన సంగతి తెలిసిందే. అయితే మీర్పూర్లో జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ 108 పరుగులతో ఇంగ్లాండ్పై సంచలన విజయాన్ని నమోదు చేసింది.
దీంతో రెండు టెస్టుల మ్యాచ్ల సిరిస్ను 1-1 తేడాతో సమం చేసింది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 220 పరుగులు చేయగా, ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 244 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ 24 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 296 పరుగులు చేసింది.

మ్యాచ్ మూడో రోజైన శనివారం 273 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 164 పరుగులకే ఆలౌట్ అయింది. స్పిన్నర్ మెహదీ హసన్ 6 వికెట్లు తీసుకుని 77 పరుగులిచ్చి బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ జట్టులో కుక్ (59), డకెట్ (56) అర్ధ సెంచరీలు చేశారు.
ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన రూట్ (56), క్రిస్ వోక్స్ (46) కాస్త ఫరవాలేదనిపించినా, మిగతా ఆటగాళ్లు పూర్తిగా విఫలమయ్యారు. రెండు ఇన్నింగ్స్లో కలిపి మొత్తం 12 వికెట్లు తీసుకున్న బంగ్లాదేశ్ యువ స్పిన్నర్ మెహదీ హసన్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్', 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డులను దక్కించుకున్నాడు.