దుబాయి: సూపర్-4లో వరుసగా రెండో ఓటమితో అఫ్గానిస్థాన్ జట్టు ఆసియాకప్ నుంచి నిష్క్రమించినట్లే. ఆదివారం భారత్xపాక్ మ్యాచ్తో పాటు అఫ్గాన్Xబంగ్లాల మధ్య ఉత్కంఠభరితంగా మ్యాచ్లు జరిగాయి. ఈ పోటీలో పాక్పై భారత్, అఫ్గాన్పై బంగ్లా విజేతలుగా నిలిచాయి. బంగ్లాదేశ్ 3 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్పై గెలిచింది. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులే చేసి ఓటమికి తలొంచింది.
హస్మతుల్లా (71) పోరాడినా అఫ్గాన్ను గెలిపించలేకపోయాడు. షెజాద్ (53), అస్ఘర్ (39), నబీ (38) రాణించారు. చివరి ఓవర్లో అఫ్గాన్కు 8 పరుగులు అవసరం కాగా.. ముస్తాఫిజుర్ 4 పరుగులే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. అంతకుముందు మహ్మదుల్లా (74), ఇమ్రుల్ కయెస్ (72 నాటౌట్) పోరాడడంతో బంగ్లాదేశ్ 7 వికెట్లకు 249 పరుగులు చేసింది. అఫ్గాన్ ఓటమితో భారత్కు ఫైనల్లో స్థానం ఖాయమైంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తడబడింది. 87 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ముష్ఫికర్ రహీమ్ (33)తో మూడో వికెట్కు లిటన్ దాస్ 61 పరుగులు జోడించడంతో ఓ దశలో బంగ్లా 81/2తో మెరుగ్గానే కనిపించింది. కానీ ఆరు పరుగుల వ్యధిలోనే మూడు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. లిటన్ను రషీద్ ఔట్ చేయగా.. షకిబ్ (0), ముష్ఫికర్ రనౌటయ్యారు. బంగ్లా కుప్పకూలుతుందనిపించినా ఎట్టకేలకు నిలబడింది.
కానీ, ఇమ్రుల్ కయెస్, మహ్మదుల్లా అద్భుతంగా పోరాడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. చక్కగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ వీలైనప్పుడల్లా బంతిని బౌండరీ దాటించిన ఈ జోడీ ఆరో వికెట్కు 118 పరుగులు జోడించింది. దూకుడుగా ఆడిన మహమ్మదుల్లాను 47వ ఓవర్లో ఔట్ చేయడం ద్వారా ఈ భాగస్వామ్యాన్ని ఆఫ్తాబ్ విడదీశాడు. ఆఖరి పది ఓవర్లలో బంగ్లా 77 పరుగులు రాబట్టడం విశేషం. అఫ్గాన్ జట్టు ప్రధాన బౌలరైన స్పిన్నర్ రషీద్ ఈసారి పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. బంగ్లాదేశ్ పుంజుకోవడంలో అదే కీలకమైంది.