మే 30 నుండి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం వెళ్లే జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన బంగ్లాదేశ్ జట్టుని బీసీబీ ప్రకటించింది. ఇప్పటికే న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, భారత దేశాలు ప్రపంచకప్ జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే.
మష్రాఫె మోర్తజాను కెప్టెన్గా.. స్టార్ ఆల్రౌండర్ షకిబ్ అల్ హసన్ను వైస్ కెప్టెన్గా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. బీపీఎల్ లీగ్లో గాయపడ్డ షకిబ్ కోలుకుని ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించాడు. ప్రస్తుతం షకిబ్ ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్లో సన్రైజర్స్ తరపున అతను ఒకే మ్యాచ్ ఆడాడు. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్స్టో, కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్, మహమ్మద్ నబి లాంటి విదేశీ ఆటగాళ్లు ఉండడంతో షకిబ్కు తుది జట్టులో ఆడే అవకాశం రావట్లేదు.
న్యూజీలాండ్ సిరీస్ లో విఫలమయిన లిటన్ దాస్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. తమీమ్ ఇక్బాల్, మొహమ్మదుల్లా, ముష్పికర్ రహీంలు (వికెట్ కీపర్), సౌమ్యా సర్కార్, షబ్బీర్ రెహమాన్, మహమ్మద్ మిథున్ లు స్పెషలిస్ట్ బ్యాట్స్మన్లుగా ఎంపికయ్యారు. మొహమ్మద్ సైఫుద్దీన్, మెహదీ హాసన్, మొసద్దేక్ హుస్సేన్, షకిబ్లు ఆల్రౌండర్ జాబితాలో ఎంపికయ్యారు. ముస్తఫిజుర్ రెహమాన్, అబు జాయేద్, రూబెల్ హుస్సేన్, మోర్తజాలు పేస్ బాధ్యతలు మోయనున్నారు.
ఈ నెల 22 నుంచి బంగ్లాదేశ్ జట్టు సన్నాహక శిబిరం ఆరంభం కానుంది. దీంతో ఐపీఎల్లో ఆడుతున్న బంగ్లా ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లనున్నారు. మే 30 నుండి ప్రపంచకప్ ప్రారంభం కానుండగా.. జూన్ 2న దక్షిణాఫ్రికాతో బాంగ్లాదేశ్ తొలి మ్యాచ్ ఆడనుంది.
బంగ్లాదేశ్ జట్టు:
మష్రాఫె మోర్తజా (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, మొహమ్మదుల్లా, ముష్పికర్ రహీం (వికెట్ కీపర్), షకిబ్ అల్ హసన్ (వైస్ కెప్టెన్), సౌమ్యా సర్కార్, లిటన్ దాస్, షబ్బీర్ రెహమాన్, మెహదీ హాసన్, మహమ్మద్ మిథున్, రూబెల్ హుస్సేన్, ముస్తఫిజుర్ రెహమాన్, మొహమ్మద్ సైఫుద్దీన్, మొసద్దేక్ హుస్సేన్, అబు జాయేద్.