ఆరంభంలోనే పెద్ద షాక్:
162 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నైకి ఇన్నింగ్స్ ఆరంభంలోనే పెద్ద షాక్ తగిలింది. స్టెయిన్ తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో వాట్సన్ (5), రైనా (0)ను ఔట్ చేసాడు. అనంతరం డుప్లెసిస్ (5), జాదవ్ (9)లను ఉమేశ్ వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. దీంతో పవర్ప్లే ముగిసేసరికి 32 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి చెన్నై కష్టాల్లో పడింది. ఈ సమయంలో ధోనీ, రాయుడు (29)లు ఇన్నింగ్స్ను నిర్మించారు. కానీ పరుగుల వేగం మాత్రం తగ్గిపోయింది.
రాయుడు అవుట్:
13వ ఓవర్లో ఉమేశ్ బౌలింగ్లో సిక్స్, ఫోర్ బాది ఊపుమీదున్న రాయుడు.. వెంటనే చాహల్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఇక చివరి ఆరు ఓవర్లలో చెన్నై 76 పరుగులు చేయాలి. ఈ సమయంలో ధోనీ ధాటిగా ఆడినా చేయాల్సిన పరుగులు పెరుగుతూ పోయాయి. 35 బంతుల్లో ధోనీ అర్ధసెంచరీ పూర్తి చేసాడు. ఇదే సమయంలో జడేజా (11), బ్రావో (5)లు ఔటయ్యారు.
|
చివరి ఓవర్ 26 పరుగులు:
చెన్నై చివరి ఓవర్లో 26 పరుగులు చేయాలి. క్రీజులో ధోనీ ఉన్నా.. చెన్నై ఓటమి లాంఛనమే అనిపించింది. కానీ ఉమేశ్ యాదవ్ వేసిన ఆ ఓవర్లో ధోనీ వరుసగా ఐదు బంతుల్లో 4, 6, 6, 2, 6తో 24 పరుగులు చేసాడు. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన స్థితిలో ధోనీ షాట్ ఆడగా.. బంతి బ్యాట్ కు కనెక్ట్ అవ్వలేదు. పరుగు కోసం ప్రయత్నించిన శార్దుల్ను బెంగళూరు కీపర్ పార్థివ్ డైర్టెక్ హిట్తో రనౌట్ చేసాడు. బెంగళూరు సంబరాల్లో మునిగితేలింది. స్టెయిన్, ఉమేశ్లు తలో రెండు వికెట్లు తీశారు.
పార్థివ్ అర్ధ సెంచరీ:
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. పార్థివ్ పటేల్ (53; 37 బంతుల్లో 2×4, 4×6), అక్షదీప్ (24; 20 బంతుల్లో 1×4, 1×6), మొయిన్ అలీ (26; 16 బంతుల్లో 5×4)లు రాణించారు. దీపక్ చాహర్, జడేజాలు తలో రెండు వికెట్లు సాధించారు.