ఆసియా కప్ 2025 ప్రారంభమైన తొలి రోజునే బీసీసీఐకి ఊహించని షాక్ తగిలింది.. ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్(సీఏయూ)లో జరిగినట్లు ఆరోపించబడుతున్న రూ.12 కోట్ల కుంభంకోణంపై విచారణ జరిపించాలని ఉత్తరాఖండ్ హైకోర్టు బీసీసీఐకి నోటీసులు జారీ చేసింది. ఈ కుంభకోణంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. రూ.35 లక్షలు కేవలం అరటిపండ్లపై ఖర్చు చేశారనే ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.
అసలు విషయం ఏమిటి?
ఉత్తరాఖండ్కు చెందిన సంజయ్ రావత్ అనే వ్యక్తి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్లో ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ ప్రభుత్వ నిధులను తీవ్రంగా దుర్వినియోగం చేస్తోందని ఆరోపించాడు. ఆటగాళ్ల అభివృద్ధి, క్రికెట్ నిర్వహణ కోసం కేటాయించిన రూ.12 కోట్లను అక్రమంగా ఖర్చు చేశారని పేర్కొన్నాడు. ఆటగాళ్లకు ఎలాంటి సదుపాయాలు కల్పించడం లేదని కూడా రావత్ తన పిటిషన్లో స్పష్టం చేశాడు.

ఆరోపణల్లోని కీలకాంశాలివే..
పిటిషనర్ సంజయ్ రావత్ చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. ఆటగాళ్ల కోసం కేటాయించిన రూ.12 కోట్ల ప్రభుత్వ నిధులను సీఏయూ దుర్వినియోగం చేసిందని పిటిషనర్ ఆరోపణలు చేశాడు. సీఏయూ ఆడిట్ రిపోర్ట్ ప్రకారం.. ఆటగాళ్లకు రూ.35 లక్షల విలువైన అరటిపండ్లు తినిపించినట్లు పేర్కొన్నాడు. ఈ ఆరోపణ ఇప్పుడు 'బనానా స్కామ్'గా ప్రచారంలో ఉంది. ఆహారం, క్యాంపుల పేరుతో కోట్లాది రూపాయల ఖర్చు చూపించినప్పటికీ, వాస్తవంగా అంత ఖర్చు చేయలేదని ఆరోపించాడు. అసోసియేషన్ తమ సొంత చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా కాకుండా, బయటి సీఏ ద్వారా ఆడిట్ చేయించుకుందని, దీని ద్వారా అక్రమాలను దాచిపెట్టే ప్రయత్నం జరిగిందని పిటిషనర్ ఆరోపించాడు.
ఈ పిటిషన్పై జస్టిస్ మనోజ్ కుమార్ తివారీ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ బీసీసీఐకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణ వచ్చే శుక్రవారం జరగనుండగా.. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమని తేలితే, ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్పై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.