బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో చెత్త నిర్ణయంతో దారుణంగా విమర్శలపాలయ్యాడు. తన సహచర ఆటగాళ్ల సమీక్ష వద్దని ఎంత నచ్చచెప్పినా ఏకపక్ష నిర్ణయంతో నవ్వులపాలయ్యాడు. 'క్రికెట్ చరిత్రలోనే చెత్త రివ్యూ, చెత్త కెప్టెన్' అని నజ్ముల్ను నెట్టింట్లో విమర్శిస్తున్నారు. అసలేం జరిగిందంటే..
రెండో టెస్టులో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆట ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (93; 150 బంతుల్లో), దిముత్ కరుణరత్నె (86; 129 బంతుల్లో), నిశాన్ మధుష్క (57; 105 బంతుల్లో) అర్ధశతకాలతో సత్తాచాటారు. మధుష్కతో కలిసి కరుణరత్నె తొలి వికెట్కు 96 పరుగులు, మెండిస్తో కలిసి రెండో వికెట్కు 114 పరుగులు జోడించాడు.

అయితే టీ విరామానికి కొద్దిసేపటి ముందు 44వ ఓవర్లో తైజుల్ ఇస్లామ్.. కుశాల్ మెండిస్ ప్యాడ్ల వైపుకు బంతిని విసిరాడు. దాన్ని మెండిస్ ముందకు వచ్చి కవర్ ఫీల్డర్ వైపుకు సాలిడ్ డిఫెన్స్తో షాట్ ఆడాడు. అయితే స్లిప్లో ఉన్న బంగ్లా కెప్టెన్ నజ్ముల్ అది ఔట్గా భావించాడు. సహచర ప్లేయర్లతో సమీక్ష గురించి చర్చించాడు. బౌలర్ తైజుల్తో సహా ఎవరూ రివ్యూపై ఆసక్తి చూపలేదు. కానీ నజ్ముల్ అంపైర్ను రివ్యూ కోరాడు.
రిప్లేలో బంతి బ్యాటుకు మిడిల్లో తగిలినట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్ నాటౌట్ అని ప్రకటించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూ, చెత్త కెప్టెన్సీ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇటీవల నజ్ముల్ హొస్సేన్ షాంటో బంగ్లాదేశ్ అన్ని ఫార్మాట్ల జట్టకు కెప్టెన్గా ఎంపికయ్యాడు. సారథిగా తనకి ఇది రెండో టెస్టు మాత్రమే. తొలి టెస్టులో శ్రీలంక చేతిలో 328 పరుగుల ఓటమిని చవిచూశాడు. కాగా, బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న శ్రీలంక టీ20 సిరీస్ను 2-1తో గెలిచింది. కానీ వన్డే సిరీస్ను 1-2తో కోల్పోయింది.