క్రికెట్లో భారత్-పాకిస్థాన్ పోరుకు ఉండే క్రేజ్ తరహాలోనే శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్కూ ఉంటుంది. మైదానంలో మినీవార్ను తలపిస్తుంది. విజయం కోసం ఆటగాళ్ల పోరాటం అభిమానులకు మంచి వినోదాన్ని పంచుతుంది. అయితే బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య జరిగిన రెండో టీ20లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. లంక ఆటగాళ్లు అంపైర్తో వాగ్వాదానికి దిగడంతో ఆట కాసేపు ఆగిపోయింది.
బుధవారం జరిగిన రెండో టీ20లో బంగ్లాదేశ్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. కమిందు మెండిస్ (37; 27 బంతుల్లో) టాప్ స్కోరర్. కుశాల్ మెండిస్ (36; 22 బంతుల్లో), మాథ్యూస్ (32; 21 బంతుల్లో) రాణించారు. అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్ రెండు వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (53*; 38 బంతుల్లో) అర్ధశతకంతో చెలరేగాడు.

అయితే మూడో ఓవర్లో వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. ఫెర్నాండో వేసిన మూడో ఓవర్ తొలి బంతికి సౌమ్య సర్కార్ (26; 22 బంతుల్లో) ఔట్గా అంపైర్ ప్రకటించాడు. బ్యాటుకు ఎడ్జ్ తీసుకుని బంతి వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లడంతో ఔట్ ఇచ్చాడు. సౌమ్య సర్కార్ రివ్యూని కోరాడు. అల్ట్రాఎడ్జ్లో బ్యాటుకు తగిలినట్లుగా రీడింగ్ చూపించింది. కానీ బ్యాటుకు బంతి దూరంగా ఉన్నట్లుగా థర్డ్ అంపైర్ భావించి నాటౌట్ ఇచ్చాడు.
దీంతో మైదానంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. శ్రీలంక ఆటగాళ్లు ఫీల్డ్ అంపైర్తో వాగ్వాదానికి దిగారు. అది ఔట్ అని గట్టిగా వాదించారు. అంపైర్లు తీవ్రంగా శ్రమించి తిరిగి మ్యాచ్ను కొనసాగించారు. ఈ నేపథ్యంలో థర్డ్ అంపైర్పై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్కు అంపైర్లు మద్దతు ఇస్తున్నారని శ్రీలంక అభిమానులు ఆరోపిస్తున్నారు. కాగా, థర్డ్ అంపైర్ నిర్ణయం కరెక్టే అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మూడు టీ20ల సిరీస్లో తొలి మ్యాచ్ శ్రీలంక గెలిచిన విషయం తెలిసిందే. నిర్ణయాత్మక ఆఖరి టీ20 శనివారం జరగనుంది.