ఢాకా వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. దాదాపుగా దశాబ్దం తర్వాత ఆసియాలో సౌతాఫ్రికా టెస్టు గెలుపు రుచి చూసింది. అంతకుముందు 2014లో గాలె వేదికగా శ్రీలంకపై సఫారీ సేన గెలిచింది. పదేళ్ల తర్వాత ఇప్పుడు విజయాన్ని అందుకుంది. ఇక బంగ్లాదేశ్లో 2008 తర్వాత టెస్టు మ్యాచ్ నెగ్గడం దక్షిణాఫ్రికాకు ఇదే తొలిసారి.
283/7 స్కోరుతో నాలుగో రోజు ఆట ఆరంభించిన బంగ్లాదేశ్ 307 పరుగులకు ఆలౌటైంది. మెహదీ హసన్ మీర్జా (97) ఆఖరి వికెట్గా వెనుదిరిగాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ ఆరు వికెట్లతో చెలరేగాడు. మహరాజ్ మూడు వికెట్లు, ముల్డర్ ఒక్క వికెట్ పడగొట్టాడు. అనంతరం 106 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. టోనీ డిజోర్జి (41), ట్రిస్టన్ స్టబ్స్ (30 నాటౌట్), ఎయిడెన్ మార్క్రమ్ (20) సత్తాచాటారు. తైజుల్ ఇస్లామ్ మూడు వికెట్లు తీశాడు.

తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 106 పరుగులకు ఆలౌటైంది. మహ్మదుల్ హసన్ (30) టాప్ స్కోరర్. రబాడ, ముల్డర్, మహరాజ్ తలో మూడు వికెట్లు తీశారు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 308 పరుగులు చేసింది. కైల్ వెరియన్ (114) సెంచరీ, ముల్డర్ (54) అర్ధశతకం సాధించారు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ అయిదు వికెట్లు, హసన్ మహ్మద్ మూడు వికెట్లు తీశారు.
కాగా, దక్షిణాఫ్రికా విజయంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ టేబుల్లో జట్ల స్థానాలు మారిపోయాయి. సౌతాఫ్రికా 47.62 విజయశాతంతో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఫైనల్ బెర్తు రేసులో పోటీగా నిలిచింది. భారత్ (68.06), ఆస్ట్రేలియా (62.50), శ్రీలంక (55.56) టాప్-3లో ఉన్నాయి. అయితే దక్షిణాఫ్రికా 4వ స్థానానికి చేరడంతో న్యూజిలాండ్ (44.44), ఇంగ్లండ్ (43.06) అయిదు, ఆరు స్థానాలకు పడిపోయాయి. బంగ్లాదేశ్ (30.56), పాకిస్థాన్ (25.93), వెస్టిండీస్ (18.52) అట్టడుగున ఉన్నాయి.