ఢాకా: ప్రొఫెషనల్ క్రికెట్ ఆడే జట్లన్నీ ప్రస్తుతం బిజీబిజీగా ఉంటోన్నాయి. సెప్టెంబర్లో ఐపీఎల్ 2021 ఫేస్ 2, అది ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ప్రారంభం కాబోతోన్న నేపథ్యంలో- టైట్ షెడ్యూల్తో ఊపిరడానంతగా మ్యాచ్లను ఆడుతోన్నాయి. భారత జట్టు ఏకంగా రెండుగా విడిపోయింది. వన్డే ఇంటర్నేషనల్స్, టీ20ల కోసం యువరక్తంతో నిండిన టీమిండియా శిఖర ధావన్ సారథ్యంలో శ్రీలంకలో సిరీస్ ముగించుకుంది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని సీనియర్ల జట్టు ఇంగ్లాండ్లో పర్యటిస్తోంది. ఇంగ్లాండ్ జట్టుతో అయిదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను ఆడాల్సి ఉంది.
ఇటీవలే- తన వెస్టిండీస్ పర్యటనను ముగించుకున్న ఆస్ట్రేలియా.. కొత్త దేశంలో అడుగు పెట్టింది. బంగ్లాదేశ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ దేశ జాతీయ జట్టుతో అయిదు టీ20ల సిరీస్ను ఆడాల్సి ఉంది. రాజధాని ఢాకాలోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో తలపడబోతోన్నాయి ఈ రెండు జట్లు కూడా. ఫ్యాన్ కోడ్ యాప్ ద్వారా ఈ మ్యాచ్లన్నింటినీ భారత ప్రేక్షకులు లైవ్ స్ట్రీమింగ్లో చేసే వీలుంది. అలాగే- ఆస్ట్రేలియాకు చెందిన ఫాక్స్ స్పోర్ట్స్ తన దేశంలో ఈ మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
బంగ్లాదేశ్లో గాజీ టీవీ, టీ స్పోర్ట్స్, బీటీవీల్లో మ్యాచులు టెలికాస్ట్ అవుతాయి. తొలి టీ20 మంగళవారం ముగిసింది. ఇందులో బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్లోనే ఆసీస్కు చుక్కలు చూపించింది. 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో మ్యాచ్ ప్రస్తుతం నడుస్తోంది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ కుప్పకూలింది. 105 పరుగులకు ఆరు వికెట్లను కోల్పోయింది. గాయం కారణంగా ఆస్ట్రేలియా కేప్టెన్ ఆరోన్ ఫించ్ వైదొలగిన విషయం తెలిసిందే. అతని స్థానంలో మాథ్యూ వేడ్ జట్టు కేప్టన్సీ బాధ్యతలను తీసుకున్నాడు. ఈ జట్టులో పంజాబీ కుర్రాడు తన్వీర్ సంఘాకు చోటు దక్కింది. అతను రిజర్వ్కే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
వేడ్ కేప్టెన్సీలోని ఈ టీమ్లో జోష్ ఫిలిప్, మిఛెల్ స్టార్క్, మిఛెల్ స్వెప్సన్, అష్టన్ అగర్, వెస్ అగర్, అలెక్స్ క్యారీ, ఆండ్రూ టై, ఆడమ్ జంపా, జోష్ హేజిల్వుడ్, మొయిజెస్ హెన్రిక్స్, మిఛెల్ మార్ష్, బెన్ మెక్డెర్మట్, డాన్ క్రిస్టియన్, రిలే మెరెడిత్, అష్టన్ టర్నర్, జేసన్ బెహ్రెన్డార్ఫ్ ఉన్నారు. నాథన్ ఎల్లిస్, తన్వీర్ సంఘా రిజర్వ్డ్గా ఉంటారు. ఇక బంగ్లా జట్టుకు మహ్మదుల్లా కేప్టెన్సీ వహిస్తాడు. సౌమ్యా సర్కార్, నయీమ్్ షేక్, షకీబుల్ హసన్, నూరుల్ హసన్ సోహన్, అఫిఫ్ హొస్సైన్, షమీమ్ హొస్సైన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, నాసుమ్ అహ్మద్, షేక్ మెహదీ హసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మహ్మద్ మిథున్, తైజుల్ ఇస్లాం, ముసడ్డెక్ హొస్సైన్ సైకట్, రుబెల్ హొస్సైన్ ఉన్నారు.