
ఢాకా: ఆస్ట్రేలియా జట్టుకు ఆతిధ్య బంగ్లాదేశ్ మరోసారి భారీ షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియాను తొలి రెండు టీ20లలో ఓడించి బంగ్లా ఇప్పటికే సంచలనం సృష్టించగా.. మూడో టీ20 కూడా గెలిచి తాము పసికూనలం కాదని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పింది. పెద్ద జట్లకు షాక్కు ఇవ్వడం బంగ్లాకు మొదటినుంచే అలవాటు. టీమిండియా కూడా బంగ్లాకు బాధిత జట్టే. శుక్రవారం రాత్రి ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన మూడో టీ20లో ఆసీస్ను 10 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించిన బంగ్లా.. ఐదు టీ20ల సిరీస్లో 3-0 తో కైవసం చేసుకుంది. బంగ్లా 127 పరుగులను కాపాడుకుని ఔరా అనిపించింది. హాఫ్ సెంచరీ చేసిన బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లాకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
తొలుత బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులు చేసింది. కెప్టెన్ మహ్మదుల్లా (53 బంతుల్లో 52 పరుగులు), ఆల్రౌండర్ షకిబుల్ హసన్ (17 బంతుల్లో 26 పరుగులు) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. నయిం (1), సర్కార్ (2), హుస్సేన్ (3) రాణించలేదు. ఆసీస్ బౌలర్లలో అరంగేట్ర మ్యాచ్ ఆడుతున్న నాథన్ ఎల్లిస్ హ్యాట్రిక్తో ఆకట్టుకున్నాడు. ఆడుతున్న తొలి టీ20లోనే ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ ఎల్లిస్ కావడం విశేషం. తొలుత 3.3 ఓవర్లకు 34 పరుగులు ఇచ్చిన ఎల్లిస్.. చివరి మూడు బంతులకు మూడు వికెట్లు తీశాడు.జోష్ హేజిల్వుడ్, ఆడమ్ జంపా రెండేసి వికెట్లు పడగొట్టారు.
128 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా ఘోరంగా తడబడింది. కేవలం 4 వికెట్లే కోల్పోయిన ఆసీస్ చివరి వరకు క్రీజులో అత్యుత్తమ బ్యాట్స్మెన్ ఉండి కూడా విజయాన్ని అందుకోలేకపోయింది. మెక్ డెర్మట్ (41 బంతుల్లో 35 పరుగులు), మిచెల్ మార్ష్ (47 బంతుల్లో 51 పరుగులు) ఆడినప్పటికీ.. వీరి ఇన్నింగ్స్ టెస్టులను తలపించింది. చివర్లో డానియల్ క్రిస్టియన్ క్రీజులో ఉన్నా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో 10 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాకు పరాభవం తప్పలేదు. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ వికెట్లేమీ తీయకున్నా.. 4 ఓవర్లలో 9 పరుగులే ఇచ్చాడు. ఇస్లాం 2.. షకీబుల్, నసుం అహ్మద్ తలో వికెట్ తీశారు. ఇప్పటికే విండీస్ చేతిలో పొట్టి సిరీస్ను కోల్పోయిన ఆసీస్కు ఇది వరుసగా రెండో సిరీస్ ఓటమి. సిరీస్లో తదుపరి మ్యాచ్ శనివారం జరగనుంది.