
హసన్ అత్యుత్సాహం:
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. టాస్ ఓడి మొదటగా భారత్ బ్యాటింగ్ చేస్తోంది. మొదటి ఓవర్ ఆడిన యశస్వి జైశ్వాల్ డిఫెన్సె ఆడి మెయిడిన్ ఓవర్ చేసాడు. వికెట్ పడకపోవడంతో బంగ్లా బౌలర్లు అసహనానికి గురయ్యారు. ఇక ఇన్నింగ్స్ రెండో ఓవర్ను బంగ్లా ఫాస్ట్ బౌలర్ తన్జీమ్ హసన్ వేస్తున్నాడు. భారత బ్యాట్స్మన్ దివ్యాన్ష్ సక్సేనా స్ట్రైకింగ్లో ఉన్నాడు.

తృటిలో తప్పిన ప్రమాదం:
పేసర్ హసన్ వేసిన రెండో ఓవర్ మూడో బంతిని సక్సేనా డిఫెండ్ చేశాడు. తనవైపే వచ్చిన బంతిని అందుకున్న హసన్ వెంటనే సక్సేనా మీదకి విసిరాడు. తలకు దగ్గరగా వచ్చిన ఆ బంతి నుంచి సక్సేనా తప్పించుకున్నాడు. తనవైపు వస్తున్న బంతిని సక్సేనా గమనించి తృటిలో పెను ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. దీంతో హసన్, సక్సేనా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఫీల్డ్ అంపైర్ కలుగజేసుకొని గొడవను సద్దుమణిచాడు. ఆ తర్వాత అంపైర్ బౌలర్ను పిలిచి మందలించాడు. బంతి నుండి సక్సేనా తప్పించుకోకుంటే పెద్ద ప్రమాదం జరిగేది. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.

రాణించిన జైశ్వాల్:
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 47.2 ఓవర్లకు 177 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బ్యాట్స్మెన్స్లో యశస్వి జైశ్వాల్ 88 పరుగులతో రాణించాడు. హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ 38 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. ధృవ్ జురెల్ 22 పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో అవిషేక్ 3.. షరీఫుల్, తన్జీమ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
తొలిసారి ప్రపంచకప్ కైవసం:
మ్యాచ్కు వరుణుడు అడ్డుపడటంతో బంగ్లా లక్ష్యాన్ని 46 ఓవర్లలో 169కి కుదించారు. బంగ్లాదేశ్ 42.1 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసింది. ఓపెనర్ పర్వేజ్ హుసేన్ (47; 7 ఫోర్లు), కెప్టెన్ అక్బర్ అలీ (43 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్స్) రాణించారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ (4/30), సుశాంత్ మిశ్రా (2/25) రాణించారు. ఈ విజయంతో అండర్19 ప్రపంచకప్ను బంగ్లా జట్టు తొలిసారి కైవసం చేసుకుంది. దీంతో బంగ్లా అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు.


Click it and Unblock the Notifications












