న్యూఢిల్లీ: పంజాబ్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ ను చెంపదెబ్బ కొట్టిన వివాదంలో ముంబయి ఇండియాకు చెందిన హర్భజన్ పై 11 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపియల్) మ్యాచుల పాటు నిషేధం విధించారు. శ్రీశాంత్, హర్భజన్ వివాదంపై సోమవారం ఢిల్లీలో బిసిసిఐ విచారణ జరిగింది. ఈ విచారణకు ఇద్దరు ఆటగాళ్లు హాజరయ్యారు. తాను తప్పు చేశానని హర్భజన్ విచారణలో అంగీకరించాడు. అయితే తాను కావాలని శ్రీశాంత్ ను కొట్టలేదని, ఇందులో ఏ విధమైన దురుద్దేశం లేదని అతను చెప్పుకున్నాడు. శ్రీశాంత్ పై తనకు ఏ విధమైన కోపం లేదని చెప్పాడు. శ్రీశాంత్ ను మ్యాచ్ రెఫరీ హెచ్చరించి వదిలేశాడు.
ఈ వివాదంలో హర్భజన్ నిషేధానికి గురై ఆదివారం జరిగిన మ్యాచులో ఆడలేకపోయాడు. ఈ వివాదంలో మ్యాచ్ రెఫరీ ఫరూఖ్ ఇంజినీర్ అభిప్రాయం కీలకమైంది. ఇప్పటికే హర్భజన్ కు బిసిసిఐ షోకాజ్ నోటీసు జారీ చేసింది. శుక్రవారం మొహాలీలో పంజాబ్ కింగ్స్ ఎలెవన్, ముంబాయి ఇండియన్స్ కు మధ్య జరిగిన మ్యాచులో ముంబయి ఇండియన్స్ ఓటమి పాలైంది. సచిన్ టెండూల్కర్ గాయం నుంచి కోలుకోక పోవడంతో హర్భజన్ కెప్టెన్సీ చేశాడు. ఈ సందర్భంగా శ్రీశాంత్ ను హర్భజన్ చెంప మీద కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో శ్రీశాంత్ తోటి ఆటగాళ్ల ముందు ఏడ్చాడు కూడా. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.