పాకిస్తాన్ సూపర్ లీగ్ లో బాల్ ట్యాంపరింగ్ వివాదం ప్రకంపనలు సృష్టించింది. కరాచీ కింగ్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో లాహోర్ ఖలందర్స్ ఈ చీప్ ట్రిక్స్ కు పాల్పడింది. ఉత్కంఠభరితమైన మ్యాచ్లో లాహోర్ ఖలందర్స్కు బాల్ ట్యాంపరింగ్ వ్యవహారంలో అయిదు పరుగుల పెనాల్టీ పడింది. ఈ నిర్ణయం మ్యాచ్ చివరి ఓవర్పై తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా నాటకీయమైన పరిణామాలకు దారితీసింది.
కరాచీ కింగ్స్ విజయానికి చివరి ఓవర్లో 14 పరుగులు అవసరమైన తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 19వ ఓవర్ ముగిశాక బాల్ ట్యాంపరింగ్ పాల్పడ్డారు ఖలందర్స్ బౌలర్లు. హారిస్ రవూఫ్ చివరి ఓవర్ వేయాల్సి ఉండగా.. షాహీన్ షా ఆఫ్రిది, హారిస్ రవూఫ్, ఫఖర్ జమాన్ బౌలర్ రనప్ దగ్గర బంతిని తమ చేతుల్లోకి తీసుకోవడం దీనికి కారణమైంది. దీనిని గమనించిన అంపైర్ ఫైజల్ ఆఫ్రిది బంతిని పరిశీలించారు.

ఆన్ ఫీల్డ్ అంపైర్ షర్ఫుద్దౌలా బంతిని క్షుణ్ణంగా పరిశీలించి చర్చించిన తర్వాత ఖలందర్స్ ఆటగాళ్లు ఉద్దేశపూర్వకంగా బంతి రూపాన్ని మార్చారని నిర్ధారించారు. దీంతో కరాచీ కింగ్స్కు అయిదు పెనాల్టీ పరుగులు కేటాయించారు. కొత్త, బంతిని తీసుకున్నారు. దీంతో కరాచీ కింగ్స్ లక్ష్యం 14 నుంచి 9 పరుగులకు పడిపోయింది. ఈ పెనాల్టీ.. మ్యాచ్పై అనూహ్య ప్రభావం చూపింది. చివరి ఓవర్లో తొలి బంతికి ఖుష్దిల్ షా ఔట్ కావడం, ఆ తర్వాత రవూఫ్ వేసిన వైడ్ బంతి ఉత్కంఠను పెంచింది.
అనంతరం అబ్బాస్ ఆఫ్రిది ఒక ఫోర్, ఒక సిక్స్ బాది కరాచీ కింగ్స్కు నాటకీయంగా విజయాన్ని అందించాడు. దీంతో కరాచీ కింగ్స్ మూడు బంతులు మిగిలి ఉండగానే గెలిచింది. బాల్ ట్యాపరింగ్ ఆరోపణలు ఎదుర్కొనాల్సి రావడం, అయిదు పరుగులు పెనాల్టీ విధించడంపై ఖలందర్స్ కెప్టెన్ షహీన్ షా ఆఫ్రిది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో దాని గురించి ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడలేదు.
బాల్ ట్యాంపరింగ్ జరిగిందో లేదో తనకు తెలియదని, కావాలంటే కెమెరాలో చూసుకోవాలని కటువుగా బదులిచ్చాడు. అయిదు పరుగులు పెనాల్టీ ఎదుర్కొనాల్సి రావడం తనను షాక్ కు గురిచేసిందని, అంపైర్లు తీసుకున్న ఈ నిర్ణయం బాధాకరమని వ్యాఖ్యానించాడు. దీని గురించి తాను ఇప్పుడు ఏమీ చెప్పలేనని, బాల్ ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనేది కెమెరాలు చూసి తేల్చుకోవాలని సూచించాడు.