హైదరాబాద్: 38వ పుట్టినరోజుని జరుపుకున్న ఆ మరుసటి రోజే టీమిండియా మాజీ ఆటగాడు సుబ్రమణియమ్ బద్రీనాథ్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. క్రికెట్లోని అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించాడు.
తమిళనాడుకు చెందిన ఈ మిడిలార్డర్ బ్యాట్స్మన్ టీమిండియా తరుపున 2008 నుంచి 2011 మధ్య కాలంలో రెండు టెస్టులు, ఏడు వన్డేలు, ఓ టీ20 ఆడాడు. రంజీ క్రికెట్లో తమిళనాడుకు 14 ఏళ్ల పాటు మిస్టర్ డిపెండబుల్గా బద్రినాథ్ సేవలందించాడు.
రంజీ క్రికెట్లో గత మూడు సీజన్లలో బద్రినాథ్ విదర్భకు రెండు సంవత్సరాలు, హైదరాబాద్కు ఒక సంవత్సరం ప్రాతినిథ్యం వహించాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 145 మ్యాచ్లాడిన బద్రినాథ్ 54.49 సగటుతో 10,245 పరుగులు చేశాడు. దాంట్లో 32 సెంచరీలు ఉన్నాయి.
ఐపీఎల్లో బద్రినాథ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2010, 2011లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలవడంతో బద్రినాథ్ తనవంతు పాత్ర పోషించాడు. ''నా కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని అనుకుంటున్నా. ఇప్పుడు నాకదే ముఖ్యం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా'' అని బద్రినాథ్ తెలిపాడు.