న్యూఢిల్లీ: వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరుగనున్న ట్వంటీ20 సిరీస్లో సత్తా చాటుతానని ఇటీవలే భారత జాతీయ క్రికెట్ జట్టులో పునరాగమనం చేసిన ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. దాదాపు ఏడాదిన్నర కాలంగా తాను ఫిట్ నెస్ కోసం చాలా కష్టించినట్లు యువరాజ్ తెలిపాడు.
తాను పడ్డకష్టం ఆడబోయే సిరీస్లో కచ్చితమైన ఫలితం ఇస్తుందని యువీ ఆశాభావం వ్యక్తం చేశాడు. తాజాగా బిసిసిఐ టీవీతో యూవీ మాట్లాడుతూ.. తిరిగి జాతీయ జట్టులోకి రావడం పట్ల ఆనంద వ్యక్తం చేశాడు. 2007లో ట్వంటీ వరల్డ్ కప్ ను భారత్ గెలిచిన క్షణాలు చాలా ఆనందాన్నివ్వగా.. గతేడాది మాత్రం తన మనసును ఎక్కువగా గాయపరిచిందని తెలిపాడు.
ప్రత్యేకంగా ట్వంటీ 20 వరల్డ్ కప్ పైనల్లో తాను ఆడిన తీరు ఇప్పటికీ కలచి వేస్తూనే ఉందన్నాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో.. చివరి 21 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేయడం తనను ఎక్కువ వేదనకు గురి చేసిందన్నాడు. ఆ వేదన ఎప్పుడూ తనతోనే ఉంటుందని చెప్పాడు.

అంతేగాక, 'ఆటను ఆస్వాదించినంతకాలం ఆడాలని ఎవరికైనా ఉంటుంది. కానీ ఒక్కసారి అంతర్జాతీయ క్రికెట్లో శిఖరాగ్రాలకు చేరుకున్న తర్వాత తిరిగి దేశవాళీ క్రికెట్ ఆత్మవిశ్వాసంతో ఆడడం అంత సులభం కాదు. కానీ తప్పదు. ఎందుకంటే మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి రావాలంటే దేశవాళీ క్రికెట్లో రాణించడం మినహా మరో మార్గం లేదు' అని చెప్పాడు.
'13, 13, 14 ఏళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన తర్వాత.. అదే స్థాయిని కొనసాగించడం చాలా కష్టం. శరీరం సహకరించదు. క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మైదానంలోకి అడుగుపెట్టడానికి చాలా శ్రమించా. ఆ క్రమంలో ఎన్నో అడ్డంకులు. కానీ ఈ ఏడాది దేశవాళీ క్రికెట్లో బాగా బ్యాటింగ్ చేశా. ముఖ్యంగా వన్డేల్లో. సరిపడినన్ని అవకాశాలొస్తే కచ్చితంగా నన్ను నేను నిరూపించుకుంటా' అని యువీ పేర్కొన్నాడు.

'కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నా. అందులో కొన్ని సాధించాను. కొన్ని సాధించలేకపోయాను. ప్రస్తుతానికైతే పరిస్థితులను అనుసరించే ముందుకెళ్లాలనుకుంటున్నాను. వచ్చిన ఏ అవకాశాన్నీ వదిలిపెట్టను. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్.. ఇలా మూడు విభాగాల్లోనూ రాణించడానికి ప్రయత్నిస్తా. మళ్లీ భారత్ను గెలిపించే ఇన్నింగ్స్ ఆడాలనుకుంటున్నా' తెలిపాడు.
'నా జీవితంలో అతి పెద్ద యుద్ధం క్యాన్సర్తో చేశాను. అదృష్టవశాత్తూ అందులో గెలిచాను. చాలామంది క్యాన్సర్ బాధితులకు స్ఫూర్తిగా నిలిచాను. అందుకే జట్టులో చోటు కోల్పోయినపుడు కుంగిపోలేదు. క్యాన్సర్తో యుద్ధం చేసిన వాడిని.. టీమ్ఇండియాలో చోటు సంపాదించలేనా.. అని నాకు నేనే చెప్పుకొనేవాడిని. ఆ స్ఫూర్తితోనే ముందుకు సాగాను' యువరాజ్ సింగ్ చెప్పాడు.